తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET)కు నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కు మూడు నెలలు ఇవ్వనున్నారు. అనంతరం వచ్చేఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ ముగిసిన తర్వాత మరో డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే టెట్, డీఎస్సీ షెడ్యూలు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించింది. ఆన్లైన్లో పరీక్షలు పూర్తయ్యాయి. ప్రిలిమినరీ కీ విడుదలైంది. త్వరలోనే ఫైనల్ కీతోపాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మరో సారి టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ–2025 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించనున్నారు. 5 వేల పోస్టులతో తదుపరి డీఎస్సీ వేస్తామని ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు కొత్త టీచర్లను నియమించాలని, డీఎస్సీ–2025 ద్వారా ఈ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది.