దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే 2023–-24ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2024–-25 ఆర్థిక సంవత్సరానికి జూలై 23వ (మంగళవారం) తేదీ బడ్జెట్ సమర్పించనున్న వేళ జూలై 22వ తేదీ ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. బడ్జెట్లో ‘ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్’పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. జూలై 23న పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి బడ్జెట్ 2024-–25ను ప్రకటిస్తారు. మొదట 1950-–51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘ఆర్థిక సర్వేలో 2024–-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. బడ్జెట్ 2024- –25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై చాలా నిర్ణయాలు తీసుకున్నాం. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థంగా కొనసాగుతున్నాయి’ అన్నారు.
సర్వేలోని ముఖ్యాంశాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికం 6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేయనున్నారు. అననుకూల వాతావరణ పరిస్థితులు ఆహార ఉత్పత్తిని అడ్డుకున్నాయి. ఉల్లిగడ్డ, టమోటా ధరలు పెరిగేలా చేశాయి. నిర్దిష్ట పంట తెగులు, రుతుపవన వర్షాలు ముందుగానే కురవడం, రవాణా అంతరాయాల కారణంగా టమోటా ధరలు పెరిగాయి.
➣ బలమైన డిమాండ్, ఎగుమతి పరిమితుల కారణంగా ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే 2015-–2019 స్థాయిల కంటే ఎక్కువగానే ఉండవచ్చు.
➣ 2023-–24లో ప్రపంచ ఇంధన ధరల సూచీ భారీగా క్షీణించింది. మరోవైపు ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించింది. ఫలితంగా రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది.
➣ ఆగస్టు 2023లో ప్రభుత్వం దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గించింది. దేశంలోని అన్ని మార్కెట్ల్లో ఒక్కో సిలిండర్పై రూ.200 తగ్గింది. అప్పటి నుంచి ఎల్పీజీ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2023 నుంచి దిగొస్తోంది.
➣ అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు.
➣ భారతీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది.
➣ బలమైన లేబర్ మార్కెట్ కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది.
➣ యువతకు ఇంకా పెద్దమొత్తంలో ఉపాధి కల్పించాలి.
➣ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల నిర్మాణ రంగం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
➣ వ్యవసాయాన్ని విడిచిపెట్టిన శ్రామిక శక్తిని తిరిగి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి.
➣ ప్రభుత్వ మూలధన వ్యయం పెరిగింది. దాంతో ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకున్నాయి. 2023-–24లో స్థూల స్థిర మూలధన వ్యయం 9 శాతం పెరిగింది.
➣ 2022-–23లో సగటున 6.7 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 2023-–24లో 5.4 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ సమస్యలు, సరఫరా గొలుసు అంతరాయాలు, రుతుపవనాల మార్పుల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తోంది.
➣ భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.
➣ 2023–-24లో మూలధన వ్యయ లోటు(సీఏడీ) జీడీపీలో 0.7 శాతంగా ఉంది. ఇది 2022-–23 జీడీపీలో 2.0 శాతంగా ఉంది.
➣ ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
➣ కార్పొరేట్, బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.