HomeLATESTటాప్​ యూనివర్సిటీల్లో లా చేసేందుకు క్లాట్ నోటిఫికేషన్​ రిలీజ్​

టాప్​ యూనివర్సిటీల్లో లా చేసేందుకు క్లాట్ నోటిఫికేషన్​ రిలీజ్​

నేషనల్​ లా యూనివర్సిటీల కన్సార్టియం దేశ‌వ్యాప్తంగా 24 లా యూనివ‌ర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్స్​కు కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్(క్లాట్‌)-–2025కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఇంటర్‌ అర్హతతోనే న్యాయ విద్యలో అడుగుపెట్టే అవకాశం, వృత్తి నైపుణ్యాలు అందించే నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే.. ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులకు దీటుగా కెరీర్‌లో రాణించే అవకాశం ఉంది. యూజీ, పీజీ పరీక్షల సెలెక్షన్​ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​ తెలుసుకుందాం..

లాయర్​గా కెరీర్​లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​ పొందడానికి క్లాట్​ ఎగ్జామ్​ముఖ్యమైంది. ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన 24 యూనివర్సిటీల్లో అడ్మిషన్స్​ సాధించవచ్చు. ఈ ఎంట్రన్స్​లో సక్సెస్​ సాధించాలంటే మ్యాథ్స్​, కరెంట్ ఎఫైర్స్​తో పాటు లా కు సంబంధించిన అంశాల గురించి అవగాహన పెంపొందించుకోవాలి.

అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)

అర్హత‌: జనరల్​ అభ్యర్థులు క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణత‌ సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులు రావాలి, గరిష్ట వయోపరిమితి లేదు.

సిలబస్​: అండర్​ గ్రాడ్యుయేట్స్​ కోసం నిర్వహించే ఎగ్జామ్​ 150 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆబ్జెక్టివ్​ తరహాలో నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 28 నుంచి 32 ప్రశ్నలు; జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌35 నుంచి 39 ప్రశ్నలు; లీగల్‌ రీజనింగ్‌ 35 నుంచి 39 ప్రశ్నలు; లాజికల్‌ రీజనింగ్‌ 28 నుంచి 32 ప్రశ్నలు; క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ 13 నుంచి 17 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కరెంట్‌ అఫైర్స్, లీగల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్‌లలో పూర్తిగా ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగంలోనూ గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ఎగ్జామ్​ ప్యాటర్న్​

సబ్జెక్ట్​ ప్రశ్నలు
ఇంగ్లీష్​ లాంగ్వేజ్​ 25 నుంచి 32
కరెంట్​ ఎఫైర్స్​, జనరల్​ నాలెడ్జ్​ 35 నుంచి 39
లీగల్​ రీజనింగ్​ 35 నుంచి 39
క్వాంటిటేటివ్​ టెక్నిక్స్​ 13 నుంచి 17
మొత్తం మార్కులు 150
సమయం 2 గంటలు

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌: ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాన్ని పరిశీలించే ఈ సబ్జెక్ట్‌లో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించడానికి కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌ రీడింగ్‌పై పట్టు పెంచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్‌ సారాంశాన్ని గ్రహించడం, ఈ ప్యాసేజ్‌ ప్రధాన ఉద్దేశం తెలుసుకోవాలి. ఇందుకోసం జనరల్‌ ఎస్సేలు, న్యూస్‌ పేపర్‌ ఎడిటోరియల్స్, ఇతర ముఖ్యమైన ఆర్టికల్స్​ ప్రిపేర్​ అవ్వాలి.

కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌: కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, కరెంట్​ అఫైర్స్​ ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లు ఇచ్చి వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సులు గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి.

లీగల్‌ రీజనింగ్‌: నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే ఈ విభాగంలో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, ఫ్యాక్ట్స్, వాటి ద్వారా జరిగే మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక సంఘటన, వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం పొందాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్‌ టెర్మినాలజీపై అవగాహన పెంచుకుంటే ఈ విభాగంలో మంచి స్కోర్​ చేయవచ్చు.

లాజికల్‌ రీజనింగ్‌: తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉండే విభాగం ఇది. ఇందులోనూ ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దీంతోపాటు అసెర్షన్‌ అండ్‌ రీజనింగ్‌ విధానం ప్రశ్నలు అడుగుతారు. సిలాజిజమ్, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి టాపిక్స్​పై ఫోకస్​ చేయాలి.

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌: పదో తరగతి స్థాయిలోని గణిత అంశాలపై పట్టు సాధిస్తే ఇందులో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలిస్తే అర్థమెటిక్‌కు ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ స్పీడ్, యావరేజ్, రేషియో తదితర అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఏడాది ఎల్ఎల్ఎం డిగ్రీ)

అర్హత‌: జనరల్​ అభ్యర్థులు క‌నీసం 50% మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ/ త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు రావాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఈ పరీక్ష 120 ప్రశ్నలతో.. 120 మార్కులకు ఉంటుంది. ఇందులోనూ ప్యాసేజ్‌ ఆధారితంగా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుగా అడుగుతారు. క్లాట్‌ పీజీలో కాన్‌స్టిట్యూషనల్‌ లా సంబంధిత ప్రశ్నలు, జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ లా, లా ఆఫ్‌ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్‌ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, ట్యాక్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఈ పరీక్షలో రెండు సెక్షన్స్​ ఉంటాయి. మొదటి సెక్షన్​ ఆబ్జెక్టివ్​ టైప్​లో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్​ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. రెండో సెక్షన్​లో డిస్క్రిప్టివ్​ తరహాలో ఉంటుంది. ఇందులో రెండు ఎస్సేలకు ఆన్సర్​ రాయాలి ప్రతి ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్​ పరీక్షలో అభ్యర్థులకు 40 శాతం ( ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35శాతం) మార్కులు వస్తేనే డిస్క్రిప్టివ్​ పేపర్​ కరెక్షన్​ చేస్తారు.

క్లాట్‌ పీజీలో విజయానికి అభ్యర్థులు తాజా ముఖ్యమైన తీర్పులు, రాజ్యాంగ, శాసనపరమైన అంశాలు, చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తాము ఎంపిక చేసుకోనున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి అకడమిక్‌గా బ్యాచిలర్‌ స్థాయిలోని అంశాలపై పట్టు సాధించడం ఈ పరీక్షలో స్కోర్‌కు దోహదం చేస్తుంది.

కోర్సు పూర్తయితే టాప్​ కెరీర్​

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో బీఏ–ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు పూర్తి చేసుకుంటే కెరీర్​ టాప్​లో ఉంటుంది. లాయర్​ వృత్తితోపాటు కార్పొరేట్‌ కొలువులు సాధించవచ్చు. ప్రస్తుతం ప్రతి సంస్థ తమకంటూ ఒక ప్రత్యేక న్యాయ విభాగం ఉండాలని, వాటి ద్వారా కార్పొరేట్‌ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తుండటమే. నేషనల్‌ లా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారిని నియమించుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, ఆర్‌ అండ్‌ డీ సంస్థలు, బ్యాంకులు వీరిని నియమించుకుంటున్నాయి. ప్రతి ఏటా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. సగటున రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షల వార్షిక వేతనం అందిస్తున్నాయి.

నోటిఫికేషన్​

పాల్గొనే విశ్వవిద్యాలయాలు: ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా), ఎన్‌ఎల్‌యూటీ (అగర్తలా), జీఎన్‌ఎల్‌యూ (సిల్వస్సా).

కోర్సులు: అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ), పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు: యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 15 నుంచి అక్టోబర్​ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్​ పరీక్ష డిసెంబర్ 1వ తేదీన నిర్వహించనున్నారు. అప్లికేషన్​ ఫీజు రూ.4,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీపీఎల్‌ అభ్యర్థులకు రూ.3,500 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.consortiumofnlus.ac.in వెబ్​సైట్​లో సంప్రదించవచ్చు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!