యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–-2025’ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో 232 ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18న ప్రారంభమైంది. అక్టోబర్ 8వ తేదీ దరఖాస్తుకు గడువు ఉంటుంది.
విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చదివి ఉండాలి. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: స్టేజ్-1 (ప్రిలిమినరీ/ స్టేజ్-1) ఎగ్జామ్, స్టేజ్-2 (మెయిన్/ స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్: పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్) ప్రశ్న పత్రాలు ఉంటాయి. మొత్తం 500 మార్కులు (పేపర్ I- 200 మార్కులు; పేపర్ II- 300 మార్కులు) ఉంటాయి.
మెయిన్స్: ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. మొత్తం 600 మార్కులు (ప్రతి పేపర్లో 300 మార్కులు) కేటాయించారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి. ఆన్లైన్లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.