టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీలో పని చేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఇందులో కీలక నిందితులని ఇప్పటికే పోలీసుల విచారణలో బయటపడింది. ఒక యువతి కోసం.. క్వశ్చన్ పేపర్ను రూ.14 లక్షలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కమిషన్ సెక్రటరీ దగ్గర పని చేసే పీఏ ప్రవీణ్తోపాటు టీఎస్టీఎస్ ఉద్యోగి రాజశేఖర్ తో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
ప్రవీణ్కు ప్రభుత్వ ఉద్యోగి రేణుకతో పరిచయం ఉంది. ప్రవీణ్ను కలిసేందుకు ఆమె రెగ్యులర్గా టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వస్తూ ఉండేది. ఆఫీస్ విషయాలు ప్రవీణ్ను అడిగి తెలుసుకునేది. పేపర్ ఎక్కడ తయారు చేస్తారు.. ఎవరి దగ్గర దాచి ఉంచుతారనే రహస్య వివరాలు.. అందుకు సంబంధించిన లోటుపాట్లు గుర్తించింది. అదే పరిచయంతో ఆమె పేపర్ లీకేజీకి ప్లాన్ చేసింది. గత నెల 28న ప్రవీణ్ను కలిసింది. తన తమ్ముడు ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్’ ఎగ్జామ్ రాస్తున్నాడని, ఎలాగైనా పేపర్ తెచ్చివ్వాలని ప్రవీణ్తో రాయబారం నడిపింది. ప్రవీణ్ అదే ఆఫీసులో పని చేసే తన మిత్రుడు అడ్మిన్ రాజశేఖర్ కు విషయం చెప్పి సహకరించాలని కోరాడు. ముగ్గురు కలిసి పేపర్ లీక్ ప్లాన్ చేశారు.
ఈ విషయం ముగ్గురి మధ్యే ఉంటుందని, బయటికి చెప్పబోమని ప్రవీణ్ను నమ్మించింది. ఇద్దరూ కలిసి.. సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ సిస్టమ్లోని పేపర్ను దొంగిలించారు. ఆమె సిస్టమ్ లాగిన్ డిటైల్స్ అన్నీ అడ్డదారిలో తెలుసుకున్నారు. ఆఫీస్లో ఎవరూ లేనపుడు ఆమె సిస్టమ్ లోని పేపర్ను పెన్డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకున్నారు. అదే పేపర్ను ప్రవీణ్ రేణుకకు అందించాడు. రేణుక ఆ పేపర్ తన తమ్ముడికి ఇవ్వటంతో పాటు ఆ ఎగ్జామ్ ఎవరెవరు రాస్తున్నారనో తెలుసుకొని అమ్మకానికి పెట్టింది.
తన ఊరి సర్పంచ్ కొడుకు రాస్తున్నాడని తెలుసుకుని, అతని ద్వారా ముగ్గురికి పేపర్ బేరం పెట్టినట్టు సమాచారం. మొత్తం రూ.14 లక్షలకు అమ్మగా.. అందులో 10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చింది. రేణుక దగ్గర పేపర్ కొన్న సర్పంచ్ కొడుకు, ఇంకో ఇద్దరు రూ.లక్ష ఇస్తే పేపర్ జిరాక్స్ కాపీ ఇస్తామని మరికొందరికీ అమ్మకానికి పెట్టారు. దీంతో విషయం గుప్పుమంది. అదే ఊరికి చెందిన కొందరు అభ్యర్థులు.. ఏకంగా టీఎస్పీఎస్సీ ఆఫీసుతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం బయటపడింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతుండటం టీఎస్పీఎస్సీ వర్గాల్లో కలవరం రేపుతుంది. ఈ పేపర్ ఒక్కటే లీకయిందా.. గతంలో జరిగిన పేపర్లు కూడా లీకయ్యే ఛాన్స్ ఉందా.. నిందితులు ఎంత కాలం నుంచి ఇలాంటి అడ్డదారులు అనుసరిస్తున్నారనే సందేహాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.