దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-–2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది.
గేట్ బెనిఫిట్స్ గేట్ స్కోర్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ(బీఏ, బీకాం, బీఎస్సీ) పోటీపడవచ్చు. ఈ స్కోర్ ద్వారా ఎంటెక్లో చేరితే నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోర్ ఉన్నవాళ్లకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఐఐటీలు గేట్ స్కోర్తో నేరుగా పీహెచ్డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.gate2025.iitr.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.