రాష్ట్రంలో కొత్తగా 2298 వార్డు ఆఫీసర్లను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలోని వార్డులు, డివిజన్లలో పని చేసేందుకు కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఈ కొత్త పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండేందుకే వార్డు ఆఫీసర్ల నియామకాలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల తరహాలో పట్టణాల్లో ప్రతి వార్డుకు ఈ వార్డు ఆఫీసర్ల సేవలను వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను రేషనలైజేషన్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,298 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని మున్సిపల్ డిపార్టుమెంట్ లెక్కలేసింది. త్వరలోనే ఈ రిక్రూట్మెంట్ చేపట్టే బాధ్యతలను టీఎస్పీఎస్సీకి అప్పగించనుంది. వార్డు ఆఫీసర్ పోస్టులకు కనీసం డిగ్రీ ఉత్తీర్ణతను అర్హతగా పరిగణించనున్నారు.
సెప్టెంబర్ చివరి వారం లేదా.. అక్టోబర్ మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసి పోస్టుల భర్తీ కసరత్తు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనులు అడ్మినిస్ట్రేషన్ పనులు ఆలస్యమవుతున్నాయని, దీనిని నివారించేందుకు ఇద్దరు సీఈలను , వారికి సహాయంగా ఇద్దరు నుంచి ముగ్గురు ఎస్ఈలను నియమించాలని ఇటీవల రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఖాళీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చే నెలలోనే వెలువడనుంది.