గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఈ పరీక్షలను జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దు భాషల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇంగ్లిష్ తప్పా మిగతా అన్ని పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న ఇంగ్లిష్/తెలుగు/ఉర్దు లో రాయాల్సి ఉంటుందని తెలిపింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ టెన్త్ స్టాండర్ట్ లో ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుందని.. ఇందులో సాధించిన మార్కులను ర్యాంకింగ్ లో పరిగణించమని తెలిపింది.
గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 503 పోస్టులకు గాను.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీంతో మొత్తం 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు.