సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే వివిధ నియామక పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ముగిసి ప్రిలిమినరీ పరీక్షలు సైతం ముగిశాయి. ఈ రోజు మరో 2 జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, లేడీ సూపరింటెండెంట్ తదితర ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
గడువు ముగిసే నాటికి 581 ఖాళీలకు గాను.. మొత్తం 1,45,358 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియను జనవరి 6న ప్రారంభించారు. ఈ నియామక పరీక్ష ఆగస్టులో ఉండే అవకాశం ఉందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ సైతం ఈ రోజే ముగిసింది. గడువు ముగిసే నాటికి మొత్తం 9,51,321 అప్లికేషన్లు వచ్చాయి.