పోలీసుల అదుపులో ఇద్దరు.. పాత పేపర్లన్నీ సేఫేనా
టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఇంటి దొంగల పనా.. టెక్నికల్ విభాగంలోనే ఎవరైనా.. హ్యాకర్లకు సహకరించారా.. అనే కోణంలో పోలీసులు శనివారం రాత్రి నుంచే దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఇంటి దొంగల పనేనని పోలీసుల విచారణలో తేలింది. టీఎస్పీఎస్సీ ఆఫీసులోని సర్వర్ నుంచే డేటా తస్కరించారని.. అక్కడి నుంచే పేపర్లు లీకవుతున్నాయనే సంచలన విషయాలు బయటపడ్డాయి.
టీఎస్పీఎస్సీ సెక్రెటరీ దగ్గర పని చేసే పీఏతో పాటు బోర్డులో పని చేసే మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ లీకేజీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్, రాజశేఖర్ అనే ఇద్దరు యువకులు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిద్దరే బోర్డులో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్నారని.. ఆఫీసర్ల డైరీల్లో ఉన్న పాస్ వర్డ్ ల ఆధారంగా వీరిద్దరే పేపర్లను లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన బోర్డు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు జరిగిన పేపర్లు కూడా ఇదే తరహాలో లీకయ్యాయా… అవన్నీ భద్రంగానే జరిగాయా.. అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
టీఎస్పీఎస్సీ లో అసలేం జరిగింది..? ఈరోజు (ఈనెల 12 ఆదివారం) జరగాల్సిన టౌన్ ప్లానింగ్ రాత పరీక్ష ప్రశ్నపత్రం లీకయిందా.. వచ్చే వారం జరగాల్సిన ఆన్ లైన్ పరీక్షల డేటా హ్యాక్ అయిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీఎస్పీఎస్సీ ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు పలు ఉద్యోగ నియామక పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. గ్రూప్ 1 మెయిన్స్తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర పరీక్షల నిర్వహణ ఏర్పాట్లో టీఎస్పీఎస్సీ బిజీ బిజీగా ఉంది.
టీఎస్పీఎస్సీ పరీక్షల షెడ్యూలు ప్రకారం ఆదివారం ఈనెల 12న Town Planning Building Overseer Recruitment రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్టుమెంట్ పరిధిలోని 175 పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్లోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదివారం జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ శనివారం రాత్రి ప్రకటన జారీ చేయటం తెలిసిందే. డేటా హ్యక్ అయిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ బోర్డ్ ఛైర్మన్ జనార్థన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. 12వ తేదీ నాటి రాత పరీక్షతో పాటు 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రిక్రూట్మెంట్ ఆన్ లైన్ పరీక్షలను కూడా టీఎస్పీఎసీసీ రద్దు చేసింది.
వరుసగా రెండు పరీక్షలకు రద్దు చేయటం సందేహాలను లేవనెత్తింది. ఒకటీ రాత పరీక్ష కావటం, రెండోది ఆన్లైన్ పరీక్ష కావటంతో ప్రశ్నపత్రం లీకైందని.. ఆన్ లైన్ పరీక్ష కు సంబంధించిన డేటా ఉన్న సర్వర్ కూడా హ్యాక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా పోలీసులే పేపర్ లీకేజీకి సంబంధించిన సమాచారాన్ని టీఎస్పీఎస్సీకి అందించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన బోర్డు అధికారులు వెంటనే మెయిన్ సర్వర్ లాగిన్ డిటైయిల్స్ చెక్ చేసి.. హ్యాకర్టు లాగిన్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.