పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను మళ్లీ జూన్ 11న నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల టీఎస్పీఎస్సీ పలు పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తుండడంతో.. గ్రూప్-1 ఎగ్జామ్ సైతం ఆన్లైన్లో నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉందంటూ మరో ప్రచారం సాగుతోంది. అయితే.. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఆఫ్ లైన్ విధానంలో.. ఓఎంఆర్ పద్ధతిలోనే గ్రూప్-1 పరీక్ష జరుగుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పరీక్ష వాయిదా పడే అవకాశమే లేదని చెబుతున్నాయి. లక్షమంది లోపు అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను మాత్రమే ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని.. లక్షమంది అభ్యర్థులు దాటితే ఆఫ్లైన్లోనే నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడిస్తున్నారు.
అయితే.. భవిష్యత్ లో తమ సామర్థ్యాన్ని పెంచుకుని లక్షల మందికైనా ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించే స్థాయికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదిలా ఉంటే.. గతేడాది ఏప్రిల్ 16న 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించింది. ఇందుకు సంబందించిన ఫలితాలను సైతం విడుదల చేసి మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో 25,050 మందిని ఎంపిక చేసింది. అయితే.. పేపర్ లీక్ అయిందని తేలడంతో ప్రిలిమ్స్ ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. మళ్లీ జూన్ 11న ఆ పరీక్షను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.