తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలపై టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏయే పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించాలి.. వేటిని ఆఫ్ లైన్ లో నిర్వహించాలనే విషయంలో టీఎస్పీఎస్సీ బోర్డు కసరత్తు చేసింది. గ్రూప్స్ (GROUPS), డీఏవో (DAO) పరీక్షలు మినహా మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్లోనే జరపాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రద్దయిన, వాయిదా పడ్డ పరీక్షలన్నింటినీ మే, జూన్ లో నిర్వహించేలా కొత్త తేదీలతో పరీక్షలను రీషెడ్యూలు చేసేందుకు రెడీ అయింది.
మార్చి 5న ఆఫ్లైన్లో జరిగిన ఏఈ (AE) పరీక్ష, జనవరి 22న ఆఫ్లైన్లో జరిగిన ఏఈఈ (AEE) పరీక్షలను ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్ మెంట్లకు ఒక్కొక్కరికీ ఒక్కోరోజు చొప్పున మూడ్రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రోజు సాయంత్రం లేదా రేపు అధికారికంగా ఈ వివరాలను టీఎస్పీఎస్సీ ప్రకటించనుంది. నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నది.
లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చిన పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు అవసరమైనన్ని సెంటర్లు ఏర్పాట్లు చేయటం ఇబ్బంది అవుతుందని.. అందుకే లక్షకుపైగా అప్లికేషన్లు ఉన్న ఉద్యోగ నియామక పరీక్షలను ఆఫ్లైన్ లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. లక్ష కంటే తక్కువ అప్లికేషన్లు ఉన్న పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే రద్దయిన డీఏవో (DAO) ఎగ్జామ్ను, టౌన్ ప్లానింగ్ (TOWN PLANNING) ఎగ్జామ్ను ఆఫ్ లైన్లో పెట్టాలని భావిస్తున్నారు. వెటర్నరీ సర్జన్ (VETERNARY SURGEON) ఎగ్జామ్ మాత్రం ఆన్లైన్ లో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్, 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, 25న అగ్రికల్చర్ ఆఫీసర్, 26, 27 గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్ పరీక్షలను వాయిదా వేసి, ఆన్లైన్లోనే పెట్టనున్నారు. గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించే పరీక్షను వరుసగా రెండ్రోజుల పాటు జరపాలని యోచనలో ఉన్నారు. లైబ్రరియన్, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలనూ ఆన్ లైన్లోనే నిర్వహించనున్నారు.
ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ 17 వేల పోస్టులకు 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు ఏడు పరీక్షలు నిర్వహించింది. పేపర్ లీక్ తో వీటిలో నాలుగు పరీక్షలను రద్దు చేసింది. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్లో జరగాల్సిన మరో 4పరీక్షలను వాయిదా వేయనున్నది. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ ను జూన్ 17న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు కావడంతో, జూన్ 11 నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఇప్పటికే రీషెడ్యూల్ తేదీని ప్రకటించింది. ఈ పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయం అభ్యర్థుల్లో నెలకొంది. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు, జులై 1న గ్రూప్ 4 పరీక్షను యథావిధిగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు మంగళవారం జరిగిన మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షల తేదీల విషయంలో టీఎస్పీఎస్సీ తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. యూపీఎస్సీ పరీక్షల షెడ్యూలుకు అనుగుణంగా రాష్ట్రంలో జరిగే పరీక్షల తేదీలను రీషెడ్యూలు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి.
Castemsr