తెలంగాణలో మొత్తం 8039 గ్రూప్-4 (TSPSC Group-4) ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పోస్టుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య దాదాపు 7.50 లక్షలకు చేరింది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసే నాటికి ఈ సంఖ్య 8 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా గ్రూప్-4 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ (TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీల పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ల్లో 141 జూనియర్ అసిస్టెంట్స్ ఖాళీలను గ్రూప్-4 లో చేర్చుతున్నట్లు ప్రకటించింది. ఇందులో 86 ఖాళీలు పురుషులు, మహిళా అభ్యర్థులు ఇద్దరికీ చెందినవి కాగా.. మరో 55 ఖాళీలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
దీంతో గతంలో పోస్ట్ కోడ్ నంబర్ 11లో నోటిఫికేషన్ సమయంలో 289 ఖాళీలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కొత్తగా చేర్చిన 141 ఖాళీలతో కలిపి 430కి చేరింది. ఏదైనా డిగ్రీ చేసుకున్న అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే గత నోటిఫికేషన్లో ఈ విభాగంలోని ఖాళీలకు అప్లై చేసుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.