TSPSC పేపర్ లీక్ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ (TSPSC) చైర్మన్ జనార్దన్రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రెస్మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు.
- ఆఫీసులో పని చేసే ప్రవీణ్ ప్రధాన నిందితుడు. పేపర్ లీకేజీ (Paper leakage) నిందితులను సిట్ (SIT) అదుపులోకి తీసుకుంది. లీకుకు సంబంధించి ఎవరో వచ్చి ఉద్యమాలు చేయలేదని..తామే గుర్తించి కంప్లయింట్ చేసినట్లు తెలిపారు.
- కమిషన్ ఆఫీస్ లో నమ్మిన వాళ్లే గొంతు కోశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అయిదుగురు ఉన్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. పేపర్ లీకేజీ వ్యవహారంలో అనవసర వదంతులు నమ్మవద్దు. ఈ ఇష్యూతో కొంతమంది కోర్టులకు వెళ్లటం.. కొందరు ధర్నాలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు వాటిని చూసి ఆందోళన చెందవద్దు.
- లీకైన ఏఈ (AE) పరీక్షపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక నివేదిక అందుతుంది. నివేదిక వచ్చిన తర్వాతే పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటాం. రద్దు చేయడమా ఇంకేదైనా చేయడమా అనే దానిపై లీగల్ ఓపినియన్ తీసుకుంటాం.
- 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
- ఇప్పటివరకు 26 రకాల పరీక్షలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. 7 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి. ఎనిమిదో పరీక్ష టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష. అందులో 175 పోస్టులకు దాదాపు 33 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
- ఎగ్జామ్కు ఒక రోజు ముందు పేపర్ లీకైనట్టు తమకు సమాచారం వచ్చింది. వెబ్సైట్ నుంచి ఎవరో సమాచారం హ్యాక్ చేసి దుర్వినియోగం చేస్తున్నట్టు దృష్టికి రావడంతో పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలిపారు.
- టీఎస్పీఎస్సీ ఇటీవల కాలంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన పేపర్లు కూడా లీక్ అయ్యాయా? అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే తేలుతుంది. దానికి అనుగుణంగానే వాటిపై నిర్ణయం ఉంటుంది. ఒక్కదాంతో అన్నింటికీ ముడిపెట్టలేము. ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తాము.
- తెలంగాణ వచ్చాక దాదాపు 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ప్రస్తుతం దాదాపు 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ లీకేజీ ఘటనతో భవిష్యతులో సైబర్ సెక్యూరిటీ.. రొబొస్టిక్ ఇంకా ఏం చేయగలం అనేదానిపై స్టడీ చేస్తున్నాం.
- గ్రూప్-1 ప్రిలిమ్స్లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ విధానం అమలు చేశాం. ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా మల్టిపుల్ జంబ్లింగ్ చేశాం. అక్రమాలు జరగొద్దనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1 మెయిన్స్ జూన్ 5న నిర్వహించాలని ఇప్పటికే ప్రకటించటం జరిగింది.
- రాజశేఖర్రెడ్డి అనే నెట్ వర్క్ ఎక్స్పర్ట్ దాదాపు ఆరేడేళ్ల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఇక్కడ పనిచేస్తున్నాడు. అతనికి అన్ని ఐపీ అడ్రస్లు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ పరిజ్ఞానంతో కీలక సమాచారం యాక్సిస్ చేసినట్టు తేలింది.
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ దాన్ని దుర్వినియోగం చేయటంతో పేపర్లు బయటకు వెళ్లాయి. పేపర్ తీసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ రాశారు. ప్రవీణ్ రూ.10లక్షలకు పేపర్లు అమ్ముకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో వెల్లడైంది.
- ప్రవీణ్కు గ్రూప్-1 ప్రిలిమ్స్లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని.. అతను క్వాలిఫై కానీ మాట కూడా నిజమేనన్నారు. ప్రవీణ్ లీవ్ పెట్టకుండా.. ఎగ్జామ్ రాయడంపై జనార్ధన్ రెడ్డి స్పందించారు. పరీక్ష రాసే అభ్యర్థి లీవ్ పెట్టడం అనేది రూల్ కాదని.. ఎథికల్ ఇష్యూ అన్నారు. ఎగ్జామ్ రాసేటోళ్లందరూ లీవ్ పెట్టరా లేదా అనేది అంతా చూడమన్నారు. అయినా గ్రూప్ 1 జాబ్ అంతా ఈజీగా రాదని.. మల్టీపుల్ స్క్రీనింగ్ ఉంటుందన్నారు. ఒకవేళ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినా.. మెయిన్స్ అలా కుదరదన్నారు.
- పేపర్ లీకేజీ వ్యవహారంలో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తన పిల్లలు ఎవరూ గ్రూప్-1 పరీక్ష రాయలేదని జనార్ధన్రెడ్డి స్పష్టం చేశారు.
పేపర్ లీక్పై.. 16లోగా నివేదిక కోరిన గవర్నర్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ పై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ గా స్పందించారు. గవర్నర్ ఆదేశాల మేరకు టీఏస్ పీఎస్సీ సెక్రెటరీ కి రాజ్భవన్ సెక్రెటరీ లేఖ రాశారు. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై, జరిపిన దర్యాప్తు పై, వెల్లడైన నిజాల పై సమగ్రమైన నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలకు సంబంధించిన అంశమైనందున, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగార్థులకు టిఎస్పిఎస్సి పై నమ్మకం కలిగించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ తమిళిసై సూచించారు.