తెలంగాణలో పోలీస్ నియామకాలకు సంబంధిచిన ఈవెంట్స్ ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 8న ఈవెంట్స్ ప్రక్రియ స్టార్ట్ కాగా.. జనవరి 5న విజయవంతంగా పూర్తి అయినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ప్రకటన విడుదల చేసింది. ఈవెంట్స్ కు మొత్తం 201706 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 111209 మంది అర్హత సాధించినట్లు తెలిపింది. మొత్తం 53.70 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ సారి కఠిన నిబంధనల కారణంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు అనర్హత సాధించారంటూ జరుగుతున్న ప్రచారంపై సైతం బోర్డు స్పందించింది. 2018-19 నోటిఫికేషన్ సమయంలో మొత్తం 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై అవ్వగా.. ఈసారి 53.7 శాతం క్వాలిఫై అయినట్లు తెలిపింది. అర్హత శాతం పెరిగినట్లు ప్రకటనలో వివరించింది.
ఇంకా.. ఈవెంట్స్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశామని తెలిపింది. లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్ కి ఒక్కొక్కరికి మూడుసార్లు ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపింది. లాంగ్ జంప్ లో 83శాతం పురుషులు, 80 శాతం మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అయినట్లు తెలిపింది. ఇంకా.. షాట్ పుట్ లో 91 పురుషులు, 96 శాతం మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది.