తెలంగాణ పోలీస్ నియామకాలకు (Telangana Police Jobs) సంబంధించి ప్రస్తుతం ఈవెంట్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నాటికి 70 శాతం మంది అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహణ పూర్తి అయినట్లు ప్రకటించింది. ఇందులో 54 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపింది. 2018లో ఇది 52 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. మరో 8, 9 రోజుల్లో ఈవెంట్స్ ను పూర్తి చేస్తామని ప్రకటింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. పలు నిబంధనల కారణంగా.. ఈవెంట్స్ లో చాలా తక్కువ మంది అర్హత సాధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) ఈ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేటలో ఈవెంట్స్ కొనసాగుతున్నాయని బోర్డు తెలిపింది. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఈవెంట్స్ నిర్వహణ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా సరళంగా, వేగంగా అత్యంత పారదర్శకంగా.. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నామని బోర్డు తెలిపింది. గతంలో ఉన్న చాలా కష్టమైన ఈవెంట్స్ ను ఈ సారి తొలగించామన్నారు. ముఖ్యంగా రన్నింగ్ విషయంలో మార్పులు తెచ్చినట్లు వివరించింది బోర్డ్. ఛెస్ట్ కొలతను కూడా తొలగించిన విషయాన్ని పేర్కొంది. తప్పుడు వివరాలను నమోదు చేయడానికి అవకాశం లేకుండా డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు బోర్డు వివరించింది.
లాంగ్ జంప్, షార్ట్ పుట్ కు ప్రతీ అభ్యర్థికి 3 అవకాశాలను ఇస్తున్నట్లు బోర్డు తెలిపింది. లాంగ్ జంప్ లో 83 శాతం మంది పురుషులు, 80 శాతం మంది స్త్రీలు అర్హత సాధిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇంకా షార్ట్ పుట్ లో 93 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు అర్హత సాధించారని తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారమే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారా? లేదా? అన్నది నిర్ధారిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
ఈవెంట్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరలో ఫైనల్ ఎగ్జామ్ ను నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులంతా తుది పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించింది.