సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలన్నీ రీ ఓపెన్ కానున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది పిల్లలున్న తరగతులను సెక్షన్లుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్య శాఖ నివేదిక అందించటంతో పాటు స్కూళ్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ సీఎంఓకు ప్రతిపాదనలు పంపించాయి. సోమవారం మధ్యాహ్నం సీఎం పాఠశాలల రీ ఓపెనింగ్పై ఆఫీసర్లలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు.
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు, గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్ , మున్సిపల్ శాఖ ల మంత్రులు, అధికారులను సిఎం ఆదేశించారు. ఆగస్టు నెలాఖరుకల్లా విద్యాసంస్థల ఆవరణలను, మూత్ర శాలలు, మరుగుదొడ్లను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రం చేయాలన్నారు. వాటర్ ట్యాంక్లను, క్లాస్ రూమ్ లను కడిగించాలని అన్నారు.
మాస్క్ తప్పనిసరి :
స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు సానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని తల్లిదండ్రులను సీఎం కేసీఆర్ కోరారు. స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినీ విద్యార్థులకు జ్వర సూచన వుంటే హెడ్మాస్టర్లు దగ్గర్లోని పీహెచ్సీకి తీసుకెళ్లి కొవిడ్ పరీక్షలు చేయించాలని సూచించారు. కోవిడ్ నిర్దారణ అయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు.