రాష్ట్రంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్–2023 (TS POLYCET-2023) నోటిఫికేషన్ ను సాంకేతిక విద్యాశాఖ ఈ రోజు విడుదల చేసింది. పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మే 17వ తేదీన పాలిసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అనంతరం 10 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ తెలిపింది.
పాలిసెట్ ద్వారా ఇంజినీరింగ్/నాన్ ఇంజినీరింగ్ సంస్థల్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమాలో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని అగ్రికల్చరల్, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలోని హార్టికల్చరల్, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలోని యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లోనూ పాలిసెట్ ద్వారా ప్రవేశాలను కల్పించనున్నారు.