ఇంటర్మీడియేట్ సెకండియర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పటికే ఫస్టియర్ ఎగ్జామ్స్రద్దు చేసిన సర్కార్, తాజాగా సెకండియర్ ఎగ్జామ్స్నూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. స్టూడెంట్లకు మార్కులను ఎలా వేయాలనే దానిపై ప్రభుత్వం ముగ్గురు ఇంటర్ బోర్డు అధికారులతో కమిటీ వేసింది. ఈ కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఫస్టియర్మార్కుల ఆధారంగానే సెకండియర్ మార్కులను వేయాలని బోర్డు ఇప్పటికే ప్రతిపాదించింది. కొత్తగా వేసిన కమిటీ ఈ ప్రతిపాదనను మరోసారి సమీక్షించనుంది. ప్రాక్టికల్ మార్కులను కూడా రికార్డుల ఆధారంగానే కేటాయించే అవకాశముంది. ఫస్టియర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్లకు ఇప్పటికే ప్రభుత్వం పాస్ చేసింది. వారికి ఎన్ని మార్కులు వేస్తారనేది ఇప్పటికీ చెప్పలేదు. 40 లేదా 45 మార్కులు వేయాలని డిమాండ్లు ఉన్నాయి. దీనిపై కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మార్కులు వేసి, రిజల్ట్ ఇవ్వనున్నారు. అయితే ఇంటర్ బోర్డు ప్రకటించే మార్కులపై అసంతృప్తి ఉన్నా, ఎగ్జామ్స్ రాయాలనుకున్న వారికి పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీంతో సెకండియర్ స్టూడెంట్లు 4,73,967 మందికి లబ్ది చేకూరనుంది.