HomeJOBSవరుసగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు

వరుసగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు

ప్రతి నెలా 2–3 ఉద్యోగ ప్రకటనలు.. జూన్‌లోనే 5–6 నోటిఫికేషన్లు

సీబీటీ విధానంలో పరీక్షలు.. ఓటీఆర్‌ అప్‌డేట్‌కు అవకాశం

తప్పుడు ప్రచారాలపై చట్టపరమైన చర్యలు: బుర్రా వెంకటేశం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ (TGPSC CHAIRMAN) బుర్రా వెంకటేశం తెలిపారు. ఇకపై ప్రతి నెలా రెండు నుంచి మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి దశలవారీగా ప్రకటనలు జారీ చేస్తామని ఆయన వివరించారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న మూడు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. వీటిలో 270కిపైగా పోస్టులు ఉండనున్నాయి. జూన్‌ నెలలోనే మొత్తం ఐదు నుంచి ఆరు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని టీజీపీఎస్​సీ ఛైర్మన్​ తెలిపారు. జూన్‌ 2 తర్వాత మరో వారం వ్యవధిలో మరిన్ని ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యేలా కమిషన్‌ కసరత్తు చేస్తోంది.

ఆర్థిక శాఖ దాదాపు 3,800 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ ఖాళీల్లో అటవీ శాఖలో 1,393 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు, రోడ్లు భవనాల శాఖలో 223 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సివిల్‌ పోస్టులు, అదే శాఖలో 49 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎలక్ట్రికల్‌ పోస్టులు, కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పోస్టులు కూడా ఉన్నాయి.

చిన్న ఖాళీలను కలిపి నోటిఫికేషన్లు

కొన్ని విభాగాల్లో ఖాళీల సంఖ్య చాలా తక్కువగా ఉండటం నియామక ప్రక్రియలో సవాల్‌గా మారిందని ఛైర్మన్‌ తెలిపారు. దాదాపు 28 కేటగిరీల్లో ఒక్కో ఖాళీ మాత్రమే ఉండగా, మరో 25 కేటగిరీల్లో ఐదుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి. 50కిపైగా పోస్టులు ఉన్న కేటగిరీలు మాత్రం కొద్దిగానే ఉన్నాయి. ఇలాంటి చిన్న ఖాళీలను వేర్వేరుగా నోటిఫికేషన్‌ ఇవ్వడం కంటే, సంబంధిత శాఖలతో చర్చించి కొన్ని పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్‌గా ఇవ్వగలమా అన్న అంశాన్ని కమిషన్‌ పరిశీలిస్తోంది. దీనివల్ల అభ్యర్థులకు స్పష్టత పెరుగుతుందని, నియామక ప్రక్రియ కూడా సులభమవుతుందని టీజీపీఎస్​సీ భావిస్తోంది.

20 పోస్టులకు 19 వేల దరఖాస్తులు

ఉద్యోగ నోటిఫికేషన్లకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వస్తోందని బుర్రా వెంకటేశం అన్నారు. కాలుష్య నియంత్రణ మండలిలోని 20 అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ పోస్టులకు దాదాపు 19 వేల దరఖాస్తులు వచ్చిన విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. పోస్టుల సంఖ్య 20 మాత్రమే ఉండటంతో చివరకు 20 మందికే ఉద్యోగం ఇవ్వగలమని, మిగిలిన వారిలో సహజంగానే అసంతృప్తి ఉండొచ్చని వివరించారు.

ఈ ఉదాహరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ తీవ్రతను వివరించారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని, చివరకు మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనలు, కమిషన్‌ విధానాల ప్రకారమే ఎంపికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 20 పోస్టులకు 19 వేల దరఖాస్తులు వస్తే, సుమారు 0.1 శాతం మందికే ఉద్యోగం దక్కుతుందని, మిగిలినవారికి అవకాశం రాకపోవడం వాస్తవ పరిస్థితి అని చెప్పారు.

పరీక్షల్లో సీబీటీ విధానం

టీజీపీఎస్సీ పరీక్షలను క్రమంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలోకి తీసుకురావాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఓఎంఆర్‌ విధానం క్లిష్టంగా మారింది. సీబీటీ ద్వారా పరీక్షల నిర్వహణ వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా జరుగుతుంది. సీబీటీ విధానంలో ప్రశ్నాపత్రాల భద్రతను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుందని ఛైర్మన్​ చెప్పారు. భవిష్యత్తులో పరీక్షకు ఒక రోజు ముందు లేదా పరీక్ష రోజే ప్రశ్నాపత్రం సెట్‌ చేసే విధానం అమలు చేస్తామన్నారు. ప్రశ్నలు అందించే నిపుణులు కూడా ఇతరులు ఏ ప్రశ్నలు పంపారో తెలుసుకునే అవకాశం ఉండదని, అందువల్ల పేపర్‌ లీకేజీ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయన్నారు.

పరీక్ష పూర్తికాగానే మార్కులు

సీబీటీ విధానంలో మరో కీలక మార్పు కూడా తీసుకురావాలని కమిషన్‌ భావిస్తోంది. పరీక్ష పూర్తైన వెంటనే అభ్యర్థులు తమ మార్కులను కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూసేలా కొత్త వ్యవస్థను అమలు చేయాలని టీజీపీఎస్​సీ యోచిస్తోంది. దీని ద్వారా ఫలితాల ప్రక్రియలో ఆలస్యం తగ్గుతుంది. అభ్యర్థుల్లో అనుమానాలకు తావు తగ్గుతుంది. నోటిఫికేషన్‌, పరీక్ష, మెరిట్‌ లిస్ట్‌, తుది ఎంపిక జాబితా వంటి దశల్లో ప్రస్తుతం పట్టే సమయాన్ని తగ్గించడమే లక్ష్యమని ఛైర్మన్​ ప్రకటించారు. నియామకాలు వేగంగా, న్యాయంగా, పారదర్శకంగా పూర్తి కావాలన్న ఉద్దేశంతో కమిషన్‌ సంస్కరణలు చేపడుతోందని వివరించారు.

ఓటీఆర్‌ అప్‌డేట్‌ ఎందుకు?

టీజీపీఎస్సీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ అప్‌డేట్‌ను తప్పనిసరి చేసింది. అభ్యర్థుల విద్యార్హతలు, సర్టిఫికెట్లు ఒకే చోట అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు. ప్రతి నోటిఫికేషన్‌కు మళ్లీ మళ్లీ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండా ఉండటమే దీని ఉద్దేశమన్నారు.

అభ్యర్థులకు తమ అర్హతలు, సర్టిఫికెట్లు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే అప్‌లోడ్‌ చేసిన పాత సర్టిఫికెట్లను మళ్లీ మార్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల అదనపు లేదా ఉన్నత విద్యార్హత సాధించిన అభ్యర్థులు మాత్రం ఆ కొత్త అర్హతను జోడించుకునే అవకాశం పొందుతారని తెలిపారు.

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పరీక్షలపై ప్రత్యేక దృష్టి

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉందని కమిషన్‌ అంచనా వేస్తోంది. ఒకేసారి లక్షలాది మంది పరీక్ష రాసే పరిస్థితి ఏర్పడితే నిర్వహణలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల మల్టీజోన్‌ల వారీగా పరీక్షలు నిర్వహించే అంశాన్ని కూడా కమిషన్‌ పరిశీలిస్తోంది.

మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2 అభ్యర్థులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే పరీక్షల నిర్వహణ సులభమవుతుందని భావిస్తున్నారు. అయితే ఒక జోన్‌లో పరీక్ష రాసిన అభ్యర్థి మరో జోన్‌లో మళ్లీ పరీక్ష రాయకుండా ఉండేలా నిబంధనలు, షెడ్యూల్‌ ఖరారు చేసే అవకాశం ఉంది.

డీఈఓ, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు

డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నాయని బుర్రా వెంకటేశం తెలిపారు. డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల విషయంలో యూజీసీ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూల అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు.

‘ప్రతిభ భారతి’ ద్వారా మరో అవకాశం

టీజీపీఎస్సీ పరీక్షల్లో అన్ని దశలు పూర్తి చేసి తుది ఎంపికలో స్వల్ప తేడాతో అవకాశం కోల్పోయిన ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉపయోగపడేలా ‘ప్రతిభ భారతి’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావాలని కమిషన్‌ భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభ ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అవసరమైన చోట ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగం తుది జాబితాలో చోటు దక్కకపోయినా, పరీక్షల్లో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పించే వేదికగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఉద్యోగార్థుల ప్రతిభ వృథా కాకుండా, ఎంప్లాయర్లకు నమ్మదగిన ప్రతిభావంతులైన అభ్యర్థుల వివరాలు అందుబాటులోకి రావడం ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తోంది.

తప్పుడు ప్రచారాలపై చట్టపరమైన చర్యలు

టీజీపీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్‌ హెచ్చరించారు. ఉద్యోగం రాని అభ్యర్థుల్లో అసంతృప్తి సహజమే అయినా, ఆధారంలేని ఆరోపణలు చేసి కమిషన్‌ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకోవడం సరికాదన్నారు. వదంతులు, అపోహలు, సోషల్‌ మీడియా ప్రచారాల ఆధారంగా అభ్యర్థులు ఆందోళన చెందవద్దని సూచించారు.

కమిషన్‌ పనితీరుపై అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారిక మార్గాల ద్వారానే తెలుసుకోవాలని సూచించారు. ఇకపై రెండు మూడు నెలలకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి టీజీపీఎస్సీ కార్యకలాపాలు, నోటిఫికేషన్లు, పరీక్షల పురోగతి వివరాలను వెల్లడించే ఆలోచన ఉందని తెలిపారు.

అభ్యర్థులు సిద్ధం కావాల్సిన దిశ

టీజీపీఎస్సీ పరీక్షలు సీబీటీ విధానంలోకి మారే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలి. కంప్యూటర్‌పై ప్రశ్నలు చదవడం, సమయాన్ని నియంత్రించడం, మాక్‌ టెస్టులు రాయడం అలవాటు చేసుకోవాలి. ఓఎంఆర్‌ పద్ధతికి అలవాటు పడిన అభ్యర్థులు కూడా సీబీటీ విధానానికి మానసికంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

ప్రతి నెలా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున ఒక్క నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూడకుండా, సిలబస్‌ ఆధారంగా నిరంతర ప్రిపరేషన్‌ కొనసాగించడం మంచిది. గ్రూప్‌ పరీక్షలు, శాఖాపరమైన పోస్టులు, టెక్నికల్‌ పోస్టులు, అటవీ శాఖ పోస్టులు ఇలా వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు వ్యూహంతో సిద్ధమైతే అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here