తెలంగాణ టెన్త్ పరీక్షా ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెన్త్ పరీక్షల వాల్యువేషన్ ముగింపు చివరి దశకు చేరుకోవడంతో, ఫలితాల విడుదలకు విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 16న పరీక్షలు ముగియగా.. రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలోనే రిజల్ట్ వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మే మొదటి వారంలోనే ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.
పరీక్షల నిర్వహణ, షెడ్యూల్:
ఈ ఏడాది టెన్త్ పరీక్షలు మార్చి చివరి వారంలో ప్రారంభమై ఏప్రిల్ 16న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల నిఘాలో, ఫ్లయింగ్ స్క్వాడ్ల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయి.
ట్యాబ్యులేషన్:
పరీక్షలు ముగిసిన వెంటనే.. ఏప్రిల్ మూడవ వారంలోనే పేపర్ వాల్యువేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాషా సబ్జెక్టులు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్), గణితం పేపర్ల వాల్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం సైన్స్, సోషల్ సబ్జెక్టుల వాల్యువేషన్ చివరి దశలో ఉంది. ఈ నెల 25వ తేదీ కల్లా అన్ని పేపర్ల స్కానింగ్ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫలితాల విడుదల తేదీ:
వాల్యువేషన్ పూర్తయిన తర్వాత అన్ని పనులు సవ్యంగా సాగితే మే మొదటి వారంలో.. అంటే మే 4 లేదా 5వ తేదీల్లో విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల అనంతరం రీ-వెరిఫికేషన్,సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా వెల్లడిస్తారు.





