టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 1వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్లను ఆన్లైన్లో ఎంచుకోవచ్చు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. మరి ఈసారి కౌన్సెలింగ్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ కోర్సుకు డిమాండ్ ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.
కౌన్సెలింగ్ లేటెస్ట్ అప్డేట్స్ :
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. వీటిలో మొత్తం 1,14,007 సీట్లు అందుబాటులో ఉండగా, 81,620 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో 3,150 సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 630 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే 84,000 మందికి పైగా అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించగా.. జూన్ 29 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు అవకాశం ఉంది.
కంప్యూటర్ సైన్స్ (CSE) గ్రూపులదే హవా:
ఈ ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సుల వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. మొత్తం సీట్లలో సింహభాగం అంటే 81,768 సీట్లు సీఎస్ఈ, ఐటీ విభాగాల్లోనే ఉన్నాయి. ఇందులో కేవలం సీఎస్ఈ (CSE) కోర్సులోనే అత్యధికంగా 27,431 కన్వీనర్ సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో సీఎస్ఈ (CSE AIML) 13,537 సీట్లతో ట్రెండింగ్లో ఉంది. ఎలక్ట్రానిక్స్ (ECE) విభాగంలో 10,851 కన్వీనర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
మంచి ర్యాంక్ వచ్చినా వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సీటు కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకే ఆన్లైన్లో ఆప్షన్లు ఎంట్రీ చేసే ముందు విద్యార్థులు ‘మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్’ పూర్తి చేసుకుని కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్లను ఒక పేపర్పై రాసి పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ tgeapcet.nic.in లో కాలేజీల ప్రొఫైల్ను చెక్ చేసుకుని ప్రాధాన్యత క్రమంలోనే ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి విడతలోనే బెస్ట్ కాలేజీలో సీటు సాధించడానికి వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.





