తెలంగాణలో మొత్తం 22వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. కొత్త జిల్లాలు, కేడర్, సబ్జెక్టులు, మీడియం ఆధారంగా పోస్టులను విభజించేందుకు విద్యాశాఖ అధికారులు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 351 కేడర్లు ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలిసింది. రాష్ట్రంలో మొత్తం 1.31 లక్షల టీచర్ జాబ్ లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇందులో ప్రస్తుతం పని చేస్తున్న వారి సంఖ్య 1.09 లక్షలుగా అధికారులు గుర్తించారు. దీంతో మొత్తం 22 వేల ఖాళీలు ఉన్నట్లు తేలింది.
జిల్లాల వారీగా కేటాయింపులు
ఇందులో కేవలం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఖాళీలను మాత్రమే ఎగ్జామ్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 30 శాతం మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తారు. మిగిలిన ఖాళీలను ఎస్జీటీలకు పదోన్నతులు అందించడం ద్వారా భర్తీ చేయనున్నారు. సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) నుంచి మార్గదర్శకాలను జారీ చేసిన అనంతరం కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. కొత్త జిల్లాల వారీగా కేటాయింపులు పూర్తయిన అనంతరం నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
విభజన పూర్తయితే నోటిఫికేషన్లు
ఇప్పటివరకు ఆర్డర్ టూ సర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల ప్రకారం కేటాయించడం.. అందుకోసం వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను ఈ నెలలో చేపట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఉద్యోగుల విభజన పూర్తైతే వెంటనే నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలిగిపోనున్నాయి. ఉద్యోగుల విభజనను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.