తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు.. పెన్షనర్లకు చేదువార్త.
కేవలం 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ తొలి పీఆర్సీ సిఫారసు చేసింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతకు మించి జీతాలను పెంచేది లేదని.. ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ముందుగానే వెల్లడించి ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్పందనను తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పీఆర్సీ రిపోర్టును ముందుగా విడుదల చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ సిఫారసులను వెల్లడించటం ద్వారా ఆయా వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను కొంతమేరకు కట్టడి చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
కమిషన్ ఏమేం సిఫారసులు చేసింది… ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించింది.. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్, ప్రమోషన్లు, పనిభారం తగ్గింపుపై ఏమేం అభిప్రాయాలను వ్యక్తం చేసింది…? అనే వివరాలన్నీ వెల్లడించటం ద్వారా .. ప్రభుత్వం ఒకింత సేఫ్ గేమ్ ప్లాన్ చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డిసెంబర్ 31న పీఆర్సీ తమ నివేదికను సీఎస్ సోమేష్కుమార్కు అందించింది. సీల్డ్ కవర్లో ప్రభుత్వం చేతికి అందిన ఈ నివేదికలో ఏముంది.. ఏమేం సిఫారసులున్నాయి.. ఎంత శాతం ఫిట్మెంట్ ఉంటుందనేది ఉద్యోగ వర్గాల్లో దాదాపు నెల రోజులుగా ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులతో చర్చలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ చర్చలకు ముందే పీఆర్సీ సిఫారసులను బయటపెట్టేందుకు.. పీఆర్సీ రిపోర్టు వెయ్యి కాపీలు ముద్రించే ఏర్పాట్లు చేసింది. ఈ ప్రింటెండ్ కాపీలను నేడో రేపో అన్ని విభాగాల అధిపతులకు పంపించనుంది. వీటినే ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలకు అందించనుంది.
ఈ రిపోర్టు అధ్యయనం చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఏపీలో ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు గత ఏడాది జులై లోనే 27 శాతం ఐఆర్ ప్రకటించింది. అంతకు మించి ఫిట్మెంట్ ఉంటుందని ఆశలు పెంచుకున్న తెలంగాణ ఉద్యోగులకు నిరాశ ఎదురవనుంది. పీఆర్సీ సిఫారసు చేసిన 8 శాతం ఫిట్మెంట్పై చర్చలు జరిపి.. చివరకు 12 శాతం మించకుండా ఫిట్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు మించి జీతాలు పెంచే ప్రసక్తి లేదని.. ఈసారి ఉద్యోగులకు నిరుత్సాహం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగులకు 8% జీతాల పెంపు: పీఆర్సీ సిఫారసు.. నేడో రేపో వెల్లడి
Advertisement