ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు వరి రైతులు తీవ్ర నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఎకరాకు పది వేల నష్ట పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పంట నష్టం తగ్గిందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి, గంగాదర, హుజురాబాద్ మండలాలతో పాటు, కరీంనగర్ గ్రామీణంలోని చమాన్ పల్లి, తాహెర్ కొండాపూర్, ఫకీర్ పేట్, జూబ్లీ నగర్, చెర్లబూత్కూరు, ముగ్దుంపూర్ తదితర ప్రాంతాల్లో 5వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని మంత్రి ప్రకటించారు. మొదటి విడత పంటనష్టంగా జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులకు ఎనిమిదన్నర కోట్లు పరిహారం విడుదలైందన్నారు. త్వరలోనే వాటిని రైతులకు అందిస్తామన్నారు. ప్రస్తుతం జరిగిన పంట నష్టాన్ని రెండు మూడురోజుల్లో పూర్తి స్థాయిలో అంచనా వేసి ఆదుకుంటామని భరోసానిచ్చారు.