తెలంగాణాలో భారీగా టీచర్ పోస్టులను భర్తీ కానున్నాయి. సుమారు 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సెకండరీ విద్యలో 13,086 ఖాళీలున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే వాటికి తోడు మరో 10నుంచి 12వేల ఖాళీలు ఏర్పడనున్నాయి.
పదోన్నతుల ద్వారా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు 2వేలు ఎస్జీటీల ద్వారా, గెజిటెడ్ హెచ్ఎం 1,970 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ల ద్వారా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 70శాతం ఖాళీలు ఎస్జీటీల ద్వారా భర్తీ య చేయనున్నారు. దీంతో సుమారు 10వేల ఖాళీలు ఏర్పడనున్నాయి.
తాజాగా ప్రకటించిన పోస్టులు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీలకు అనుబంధ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులే సుమారు 18వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఎస్టీజీ రిక్రూట్మెంట్లో 70 శాతం రిజర్వేషన్ కలిగిన డీఈడీ(టీటీసీ) అభ్యర్థులకు గొప్ప చాన్స్ అని చెప్పవచ్చు.
అయితే డీఎస్సీ లేదా టీఆర్టీ నిర్వహించే ముందు ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రభుత్వం టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ TET నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చివరి సారిగా 2017లో టెట్ జరిపారు. ఇప్పుడు బీఈడీ చేసిన వారికి కూడా ఎస్టీజీ పోస్టులకు అర్హత కల్పించగా వారికి టెట్ పేపర్ 1 రాసే అవకాశం కల్పిస్తారు.
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా టెట్ నిర్వహణ, ఫలితాల ప్రకటన అనంతరం టీఆర్టీ నిర్వహణ, ఫలితాలు, మెరిట్ జాబితా విడుదల, కౌన్సెలింగ్ నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం 6 నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్న మాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు తొలిసారిగా 2017లో చేపట్టారు. అనంతరం ఐదేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో లక్షలాది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు మెగా డీఎస్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు