అకాల వర్షాలతో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి ఈ రోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను మే ఒకటవ తేదీలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ హనుమంత రావు లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రతీ మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి జరిగిన పంట నష్టం వివరాలను సమర్పించాలని కోరారు. గతంలో జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుండి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణ కేంద్రాలలో ఉన్న వరి ధాన్యం తడవకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.