రాష్ట్రంలో ఉన్న 138 బీసీ గురుకులాలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2017–18 విద్యాసంవత్సరంలో 5, 6. 7 తరగతులను ప్రారంభించగా.. ప్రతి ఏడాది ఒక్కో తరగతిని పెంచుకుంటూ వస్తుండగా ఈ విద్యాసంవత్సరం నాటికి పదోతరగతి స్థాయి వరకు వచ్చింది. కాగా వచ్చే ఏడాది 2022–23 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 138 బీసీ గురుకులాలు ఉండగా వీటిలో 68 బాలురు, 70 బాలికల గురుకులాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 21, 680 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజాగా ఇంటర్మీడియేట్వరకు అప్గ్రేడ్ కావడంతో వీరందరికీ లబ్ది చేకూరనుంది.
కొత్త కోర్సులూ అందుబాటులో..
బీసీ గురుకులాల్లో పలు కొత్త ఒకేషనల్ కోర్సులూ ప్రవేశపెడుతున్నట్టు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ, టూరిజం అండ్ హాస్పిటాలజీ మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెడుతున్నామని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.