ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకున్న వారిని ఇండియన్ ఆర్మీ నెలకు లక్ష జీతంతో కొలువులు ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) విధానంలో 381 టెక్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. పెళ్లికాని పురుషులు, మహిళలూ వీటికి పోటీ పడవచ్చు. ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. శిక్షణ అనంతరం పీజీ డిప్లొమా అందుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ పొందవచ్చు.
ఖాళీలు: పురుషులకు 350, మహిళలకు 29, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. మెన్ పోస్టుల్లో విభాగాల వారీ.. సివిల్ 75, కంప్యూటర్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ప్లాస్టిక్ 17 ఉన్నాయి. మహిళలకు.. సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 4, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 9 కేటాయించారు.
అర్హత: సంబంధిత/ అనుబంధ విభాగాల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు.. బీటెక్ (ఐటీ), ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులవారూ అర్హులే. డిఫెన్స్ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు, మరొక దానికి ఇంజినీరింగ్ అభ్యర్థులు పోటీపడవచ్చు. వయసు 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఆర్మీ విడోల గరిష్ట వయసు 35 ఏళ్లకు మించరాదు.
సెలెక్షన్: దరఖాస్తులను గ్రాడ్యుయేషన్ (బీటెక్) మార్కులతో వడపోస్తారు. తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలి రోజు స్టేజ్-1లో ఉత్తీర్ణులే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్-2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులోనూ విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు.
ట్రైనింగ్: ఎంపికైన వారికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2025 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ అందిస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్ కమిషన్) తీసుకుంటారు. మిగిలిన వారికి మరో నాలుగేళ్ల పాటు సర్వీస్ పొడిగిస్తారు. ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.