TSPSC నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 16న జరుగనుంది. ఇంకా 35 రోజుల టైమ్ మాత్రమే ఉంది. చివరి అయిదు రోజులు రివిజన్కు వదిలేసినా.. సరిగ్గా నెల రోజులు మిగిలాయి. అందుకే అభ్యర్థులు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టినా.. ఏ ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏయే టాపిక్స్ రివిజన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం.
జాగ్రఫీ:
ఇందులో ప్రపంచ, భారత, తెలంగాణ జాగ్రఫీ మూడు సబ్జెక్టులున్నాయి. ఎక్కువ ప్రాధాన్యం తెలంగాణ జాగ్రఫీకి ఇవ్వాలి. తెలంగాణ జాగ్రఫీని 33 జిల్లాల సమగ్ర సమాచారంతో గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇండియా జాగ్రఫీ, చివరి ప్రాధాన్యత ప్రపంచ జాగ్రఫీకి ఇవ్వాలి. ఇండియన్ జాగ్రఫీలో భౌగోళిక నైసర్గిక స్వరూపం, జనాభా, అడవులు, రవాణా వ్యవస్థ, నదీ వివాదాలు, స్మార్ట్ సిటీలు చదవాలి. కోవిడ్ ప్రభావంతో పాటు రష్యా–ఉక్రెయిన్, నూతన దేశాల ఏర్పాటు, శ్రీలంక సంక్షోభం, అఫ్ఘనిస్థాన్ సమస్య, చైనా సరిహద్దులు, భారతదేశం ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల కారణంగా ఈ కోణంలో జాగ్రఫీ అంశాలను ఫోకస్ చేయాలి.
కరెంట్ ఎఫైర్స్:
ఇందులో మొత్తం మూడు అంశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ, అంతర్జాతీయ అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన విజయాలు తెలుసుకోవటం తప్పనిసరి. జాతీయ అంశాలలో గత సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన అంశాలను, పరీక్షకు ఆరు నెలల ముందు జరిగిన అంశాలను పరీక్ష కోణంలో చదవాలి. ఇటీవలి అంశాలను లోతుగా విశ్లేషించి చదవాలి.
అంతర్జాతీయ అంశాలకు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన వాటి మీద ఫోకస్ చేయాలి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్వాడ్ దేశాల సదస్సు, సౌత్ చైనా సముద్రం, జీ20 సమావేశం, బిమ్స్టెక్, ఆసియాన్, అపెక్ మొదలైన అంతర్జాతీయ సదస్సుల మీద ఫోకస్ చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో వార్తలో వచ్చిన ప్రదేశాలు, అంతర్జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న భారతీయుల గురించి చదువుకోవాలి.
అంతర్జాతీయ సంబంధాలు–సంఘటనలు:
కరెంట్ ఎఫైర్స్ తో సంబంధం లేకుండా అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు వేరుగా ఉంటాయి. ఐక్యరాజ్యసమితి, పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు, ఇండియా విదేశీ విధానం, ఆలీన ఉద్యమం, ప్రపంచీకరణ, ప్రాంతీయ సహకారం మొదలైనవి ఇందులో ఉంటాయి.
అంతర్జాతీయ సంఘటనలలో ముఖ్యంగా ఇంటర్పోల్, రెడ్క్రాస్, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్, రిమ్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, నాటో, జీ77, జీ8, జీ20, జీ24 దేశాల సదస్సులు, వివిధ దేశాల మధ్య అణుసంబంధాలు ఇందులో ముఖ్యంగా ఉంటాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ:
జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ, జువాలజీకి సంబంధించిన అంశాలు వస్తాయి. స్టాటిక్ అంశాల కంటే డైనమిక్ జనరల్ సైన్స్ కీలకం. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన విజయాలే కాకుండా, వివిధ సంస్థలు చేసిన కృషి గురించి చదవాలి. ఉదాహరణకు డీఆర్డీవో, బార్క్, ఇస్రో, హాల్ సాధించిన విజయాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ సమయంలో వివిధ కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో పోషించిన పాత్ర, రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీల కృషి మీద అవగాహన ఉండాలి. ఉదాహరణకు ఈసీఐఎల్, రిచ్, డీఆర్డీవో మొదలైన సంస్థలు గురించి తెలుసుకోవాలి.
పర్యావరణం–విపత్తు నిర్వహణ:
స్టాక్హోమ్ సమావేశం నుంచి బయోడైవర్సిటీ సదస్సు వరకు ముఖ్యమైన చట్టాలు, వాటిలో ఉండే అంశాలు, ఇండియా పాటించిన నిబంధనల గురించి అవగాహన ఉండాలి. బయో డైవర్సిటీ చట్టం నుంచి భారత ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించిన తడిభూముల (వెట్ ల్యాండ్స్) వరకు చదువుకోవాలి.
భారతదేశ ఆర్థిక, సాంఘిక అభివృద్ధి:
మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక వరకు అభ్యర్థులకు అవగాహన ఉండాలి. అభివృద్ధి కోణమే ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమిలో సాంఘిక అభివృద్ధి అనే కోణాన్ని మాత్రమే చదవాలి. పూర్తి ఎకానమీ అవసరం లేదు. సాంఘిక అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి ఎలా జరిగింది.. వీటిలో వివిధ సామాజిక వర్గాలకు ఉద్దేశించి ప్రారంభించిన పాలసీలు అభివృద్ధికి ఎలా దోహదపడ్డాయనే టాపిక్స్ చూసుకోవాలి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన పథకాలు, ఉపాధి కల్పన పథకాలు, గ్రామీణ ప్రాంతాల కొరకు ప్రవేశ పెట్టిన పాలసీలను అవగాహన చేసుకోవాలి.
హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా:
చరిత్రతో పాటు భారతదేశ వారసత్వ సంపద మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. చారిత్రక నేపథ్యం అంటే రాజకీయ నేపథ్యం చదవకూడదు. సాంఘిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. జాతీయోద్యమం మీద వచ్చే ప్రశ్నలు సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా ఉంటాయి. ప్రాచీన చరిత్రకు ప్రాధాన్యత పెరిగింది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో చారిత్రక కోణం వదిలిపెట్టి, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేయాలి.
రాజ్యాంగం–రాజకీయ వ్యవస్థ:
రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థకు ఉన్న తేడా గమనించి ప్రిపేర్ అవ్వాలి. పోటీ పరీక్షలో రాజ్యాంగం అంశాలైన ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మూడొంతుల సిలబస్ చదివినట్లే. రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ చాలా ముఖ్యమైనవి.
గవర్నెన్స్–ప్రభుత్వ విధానం:
ఎలక్షన్ కమిషన్, లోక్పాల్, లోకాయుక్త, వివిధ కమిషన్స్ గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు విధాన పాలసీలు, భారత్ నిర్మాణ్ విధానాలు, అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీలు, పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు ముఖ్యంగా చదవాలి.
రాష్ట్ర పాలసీలు:
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ విధానాలతో పాటు సంక్షేమ పథకాలు ఈ అంశం కిందకే వస్తాయి.
తెలంగాణ సమాజం, సంస్కృతి, కళలు, సాహిత్యం:
1948 నుంచి తెలంగాణ సమాజం, సంస్కృతి, సంపద, కళలు, సాహిత్యానికి సంబంధించిన అంశాలను మూడు రకాలుగా చెప్పవచ్చు. వీటిని ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక తెలంగాణ చరిత్రగా విభజించుకోవాలి. రాజకీయ, ఆర్థిక చరిత్రకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయి, సాంస్కృతిక, సామాజిక చరిత్రకు ప్రాధ్యాన్యత పెరిగిందని గుర్తుంచుకోవాలి.
సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద అవగాహన ఉండాలి. జెండర్, వివిధ తెగలకు, కులాలకు, అంగవైకల్యం వారికి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటి అమలు, సమాజంలో అట్టడుగు ప్రజలకు అందుతున్న పాలసీల గురించి చదవాలి.
మ్యాథ్స్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్:
ఈ సబ్జెక్ట్ పూర్తిగా ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ప్యూర్ మ్యాథ్స్ కష్టంగా భావిస్తే రీజనింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ గమనిస్తే సంఖ్యా పరంగా చూస్తే 13 విభాగాలున్నాయి. లోతుగా గమనిస్తే 22 చాప్టర్లు. మనం 13 విభాగాలు పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో విభాగం నుంచి సరాసరి 12 నుంచి 13 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. అన్ని పోటీ పరీక్షలకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్పేపర్కు చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ నెల రోజులు డెయిలీ ప్రాక్టీస్ చేయాలి.
Good
Sir please tell me the which qualification is required for the group1
Can you please post the same in English?
Good information tq