టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో తవ్విన కొద్దీ.. మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న ప్రవీణ్ ఎన్ని పేపర్లు లీక్ చేశాడు.. అతని పెన్ డ్రైవ్లో ఎన్ని పేపర్లున్నాయి.. అనే కోణంలో సిట్ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రవీణ్ గ్రూప్ వన్ పరీక్ష రాయటం, 103 మార్కులు బబ్లింగ్ చేసిన ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ బయటపడటంతో గ్రూప్ వన్ పేపర్ లీకైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రవీణ్, రాజశేఖర్, గురుకుల్ టీచర్ రేణుక, ఆమె భర్త పక్కా ప్లాన్ ప్రకారం ఏఈ పేపర్ను లీక్ చేసి.. అభ్యర్థులకు అమ్ముకోవటంతో ఈ వ్యవహారం గుట్టు రట్టయింది. ప్రవీణ్ పెన్ డ్రైవ్లో మరో మూడు పేపర్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఈ ఎగ్జామ్తో పాటు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లోని పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్లు ప్రవీణ్ పెన్ డ్రైవ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించింది.
లీకైనట్లు అనుమానించిన రోజునే 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ తో పాటు.. 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ పోస్టుల ఎగ్జామ్లు ఇంకా జరగలేదు. ప్రవీణ్ ఈ పేపర్లన్నీరెండు మూడు రోజుల ముందు లీక్ చేసి అభ్యర్థులకు అమ్ముకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ రాజశేఖర్ టీచర్ రేణుక సాయంతోనే ఈ లీకేజీ దందాకు పాల్పడినట్లు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.
దర్యాప్లులో భాగంగా సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ గురువారం టీఎస్పీఎస్సీ ఆఫీసర్లతో భేటీ అయ్యారు. సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ పాస్ వర్డ్ ను ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రవీణ్ కి లబ్ధి చేకూర్చేందుకు కంప్యూటర్ లాన్ లో రాజశేఖర్ పలు మార్పులు చేసినట్లు గుర్తించారు. అయిదు పేపర్లను ప్రవీణ్ తన పెన్ డ్రైవ్ లో పేపర్స్ ని సేవ్ చేసుకున్నాడని, భవిష్యత్లులో జరిగే అన్ని పేపర్లు ఇస్తానని రేణుక కు ప్రవీణ్ మాట ఇచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. పరీక్షలు రాయబోయే అభ్యర్థులను వెతికి పేపర్లకు బేరం మాట్లాడి పెట్టాలని ప్రవీణ్ రేణుకకు చెప్పినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
వరుసగా వెలుగుజూస్తున్న ప్రవీణ్ లీలలతో పేపర్ లీకేజీ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందనే ఆందోళన నిరుద్యోగులను వెంటాడుతోంది. ప్రధానంగా గ్రూప్ 1 పరీక్షపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. పేపర్ లీకేజీ జరిగిన తీరుపై… టీఎస్పీఎస్సీ నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతుండటంతో ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగానే మారింది. బోర్డు ఛైర్మన్ తో పాటు మెంబర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయని లక్షలాది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.