గ్రూప్-1 పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.200, పరీక్ష ఫీజు 120. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్సర్వీ్సమెన్ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పరీక్ష ఫీజులో మినహాయింపు కూడా ఇచ్చింది. తాము నిరుద్యోగులమని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఓసీ అభ్యర్థులకు కూడా పరీక్ష ఫీజులో మినహాయింపు ఇస్తోంది. కానీ.. TSLPRB టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన పోలీస్, ఎక్సైజ్ పోస్టులకు అప్లై చేయాలంటే ఫీజులను తలుచుకొని అభ్యర్థులు బెదిరిపోతున్నారు.
ఆరు వివిధ విభాగాల్లో 17,294 పోస్టుల భర్తీకి TSLPRB నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో ఉన్న 10 రకాల పోస్టులకు వేర్వేరుగా ఫీజులను నిర్ణయించారు. ఎస్సై ర్యాంకు పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 వసూలు చేస్తున్నారు. కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.400 ఫీజుగా నిర్ణయించారు. అంటే.. ఓసీ, బీసీ అభ్యర్థులు అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేయాలంటే రూ.8800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.4400 చెల్లించాలి. ఇంత భారీ ఫీజు చెల్లిస్తేనే అన్ని పోస్టులకు దరఖాస్తు చేయటం కుదురుతుంది.
గ్రూప్-1 పోస్టుల భర్తీకి రూ.200 ఫీజు ఉంటే.. నిరుపేదలు ఎక్కువగా పోటీపడే పోలీసు ఉద్యోగాలకు అయిదు రెట్లు ఫీజులు వసూలు చేయటంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పోస్టులకు అర్హతలున్నా ఫీజుల భారం వల్ల దరఖాస్తు చేసుకోలేక పోతున్నామని, పోస్టుల వారీగా ఫీజులను తగ్గించాలని వేలాది మంది అభ్యర్థులు సోషల్ మీడియా, ట్విటర్ లో ప్రభుత్వానికి తెలిసేలా పోస్టులు పెడుతున్నారు. మొదటి రెండు రోజుల్లోనే పోలీస్ ఉద్యోగాలకు 32 వేల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది.