కరోనా కారణంగా పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో ఒకటో తరగతి నుంచి పీజీ వరకు డిజిటల్, ఆన్ లైన్ విద్యాబోధన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు గుణాత్మకమైన డిజటల్, ఆన్లైన్ తరగతులను నిర్వహించబోతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 1వ తేదీ నుంచి డిజిటల్, ఆన్ లైన్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. టీవీ, టెలివిజన్, స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యార్థులకు బోధన కొనసాగుతుంది. టీవీలు లేని పిల్లలు గ్రామపంచాయితీ కార్యాలయాలు, గ్రంధాలయాల్లోని టీవిలను వినియోగించుకునే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. దూరదర్శన్, T-SAT పాఠాలను వీక్షించని వారి కోసం ఆ డిజిటల్ పాఠాలను ప్రత్యేకంగా T SAT యాప్ లోనూ, దూరదర్శన్ యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంచుతామన్నారు. తమకు అనువైన సమయంలో ఈ డిజిటల్ పాఠాలను రివిజన్ చేసుకునే వీలుంటుంది. విద్యార్థులకు సంబంధించిన డిజిటల్ క్లాసులు, వర్క్ షీట్లను కూడా SCERT కి సంబంధించి htts://scert.telangana.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. పాఠశాల స్థాయి నుండి డిగ్రీ వరకు రోజూ యాభై శాతం ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది హాజరు కావాలని మంత్రి సూచించారు.