తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలు విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుండడంతో ఇక్కడ తమ పిల్లలను చేర్చేందుకు పేరేంట్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇంకా స్టూడెంట్స్ సైతం ఇక్కడ చేరేందుకు పోటీ పడుతున్నారు. ఈ ప్రతిష్మ్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రకటన కోసం లక్షలాది మంది విద్యార్థులు ప్రతీ ఏటా ఎదురు చూస్తుంటారు. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్థ పరిధిలోని 14 ప్రతిభా కళాశాలల్లో (COE) అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపు అంటే ఈ నెల 27న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు వచ్చే నెల 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్ సైట్లో తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.