తెలంగాణా విద్యార్థులకు సీఎం కేసీఆర్ పేరుతో ఫెలోషిప్ అందించాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఓయూలో పీహెచ్డీ చేస్తున్న ప్రతి స్టూడెంట్కు కేసీఆర్ డాక్టోరల్ ఫెలోషిప్ పేరిట నెలకు రూ.10వేల చొప్పున ఇవ్వాలని భావిస్తోంది. జేఆర్ఎఫ్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మౌలానా అజాద్ తదితర ఫెలోషిప్ల కింద ఆర్థిక సహకారం అందని విద్యార్థులకు కేసీఆర్ డాక్టోరల్ ఫెలోషిప్ (కేడీఎఫ్) ఇవ్వాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంంది. ఈ ప్రతిపాదనలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వానికి పంపించింది.
ఓయూలో ప్రస్తుతం దాదాపు అయిదు వేల మంది పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో సుమారు 30 శాతం మందికి వివిధ స్కీంల కింద ఫెలోషిప్ అందుతోంది. మిగతా విద్యార్థులు ఫెలోషిప్ అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రస్తుతం హెచ్సీయూ సహా పలు యూనివర్సిటీలు నాన్నెట్ ఫెలోషిప్ కింద ప్రతి విద్యార్థికి రూ.10వేల వరకు ఫెలోషిప్ను అందిస్తున్నాయి. అదే విధంగా ఓయూలో సీఎం కేసీఆర్ పేరుతో ఫెలోషిప్ కింద రూ.10వేలు అందిస్తే బాగుంటుందని ఓయూ భావిస్తోంది. ఇటీవల జరిగిన వీసీ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేష్కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి ఓయూ వైస్ ఛాన్సలర్ ఈ ఫెలోషిఫ్ వివరాలను ప్రస్తావించారు. ఈ ఫెలోషిఫ్ అందించే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.