నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్- 2022 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. డిసెంబర్ మధ్యలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావొచ్చని కొన్ని నివేదికలు చెప్తున్నాయి.
నాలుగు సెషన్స్లో ఎగ్జామ్?
ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారితో జేఈఈ మెయిన్ 2021 పరీక్షను ఫిబ్రవరి, మార్చి, జులై, ఆగస్టులో మొత్తం నాలుగు సెషన్లలో నిర్వహించారు. జేఈఈ మెయిన్స్- 2022 పరీక్ష కూడా ఈ ఏడాది మాదిరిగానే నాలుగు సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయనే అంశంపై ఈ సెషన్లు ఆధారపడి ఉంటాయని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి తెలిపారు.
ఫిబ్రవరి నుంచి సెషన్స్
జేఈఈ మెయిన్- 2022 పరీక్షను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో నిర్వహించవచ్చు. పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో అధికారిక వెబ్సైట్ అయిన www.jeemain.nta.nic.in లో ప్రకటించవచ్చు. రిజిస్ట్రేషన్ డిసెంబర్ మధ్య నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తరువాతే చివరి తేదీ, షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
సేమ్ సిలబస్
జేఈఈ మెయిన్- 2022 సిలబస్, ఎగ్జామ్కు సంబంధించిన పేపర్ ప్యాటర్న్ ఈ సంవత్సరం మారకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సీబీఎస్ఈ సహా కొన్ని బోర్డులు ఈ సంవత్సరం 12వ తరగతి సిలబస్ను 30 శాతం తగ్గించాయి. అయితే జేఈఈ మెయిన్- 2022 సిలబస్ మాత్రం 2021 సిలబస్ మాదిరిగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.