తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారులు ఫోకస్ చేశారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మధ్యలో ఈ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫీజుల షెడ్యూల్ను ఒకటి రెండు రోజుల్లో జారీ చేసే అవకాశాలున్నాయి.
ఇంటర్ షెడ్యూల్ తర్వాత టెన్త్
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిన వెంటనే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేయనున్నారు. ఒకవేళ మే 15వ తేదీకి గనుక ఇంటర్ పరీక్షలు పూర్తయితే.. మే నెలాఖరు లేదా, జూన్ మొదటి వారంలో పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.
70 శాతమే సిలబస్
ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 23 నుంచి నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనాతో ఆఫ్లైన్ క్లాసుల ప్రారంభం కొంత ఆలస్యం కావడంతో పాటు, మధ్యలో ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను నిర్వహించడంతో కొన్ని రోజుల పాటు టీచింగ్కు అటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వార్షిక పరీక్షలను అనుకున్న దానికంటే.. కొద్ది రోజులు ఆలస్యంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. అలాగే.. ఈ ఏడాది ప్రత్యక్ష తరగతుల ప్రారంభం ఆలస్యమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్తో పాటు టెన్త్లో కూడా 70 శాతం సిలబస్ అమలు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకుంది.