ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిలైన స్టూడెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 4.59 లక్షల మంది పరీక్షలు రాస్తే.. ఏకంగా 2.35 లక్షల మంది ఫెయిలవటంతో ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
కరోనా ఎఫెక్ట్ తో రెండేండ్లు విద్యార్థులు స్టడీకి దూరం కావటం.. సెకండియర్ పాఠాలు జరిగే టైమ్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పెట్టడం.. నెల రోజులు కూడా క్లాసులు నిర్వహించకుండానే ఎగ్జామ్స్పెట్టిన కారణంగానే 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఇంటర్ బోర్డు కూడా అంచనాకు వచ్చింది. అందుకే రిజల్ట్ వెల్లడించటంలోనూ జాప్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. తీరా.. రిజల్ట్ వెల్లడించిన తర్వాత రాష్ట్రమంతటా దుమారం చెలరేగటంతో ఇటు ఇంటర్ బోర్డు.. అటు ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
ఇప్పుడేం చేద్దామనే విషయంలోనూ ఉన్నత స్థాయిలో తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎంకు పంపించినట్లు తెలుస్తోంది. మొత్తం ఫెయిలైన స్టూడెంట్లను కూడా మినిమమ్ మార్కులతో పాస్ చేయటం.. లేదా ఉచితంగా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ సదుపాయం కల్పించాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. అవే ప్రతిపాదనలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎంకు ఫైల్ను అందజేసినట్లు తెలిసింది. సీఎం తీసుకునే తుది నిర్ణయం మేరకే చర్యలుంటాయని బోర్డు అధికారులు చెబుతున్నారు.
సీఎం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే.. ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్లో జరిగే పరీక్షల్లోనే ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండియర్ పరీక్షలు అటెండ్ చేయాల్సి ఉంటుంది. కేవలం నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈలోగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే ప్రసక్తి లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈసారి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును సగానికి తగ్గించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.