ఇంటర్మీడియేట్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సులు చదవాలనుకునే వారికి గుడ్న్యూస్. ఇంటర్ అర్హతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చదివేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ –ఐఐఎం రోహ్తక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరిన వారికి మూడేళ్ల తర్వాత బీబీఏ డిగ్రీని, ఐదేళ్ల తర్వాత ఎంబీఏ డిగ్రీని అందజేస్తారు. టెన్త్, ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 55శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. వయసు 20 ఏళ్ల లోపు ఉండాలి. ఎంట్రెన్స్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
కోర్సులో భాగంగా ఏడాదికి మూడు టర్మ్ల చొప్పున ఐదేళ్లలో 15 టర్మ్లు ఉంటాయి. ఒక్కో టర్మ్ వ్యవధి 3నెలలు ఉంటుంది. ప్రతి అకడమిక్ ఇయర్ చివరలో ఇంటర్న్షిప్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కోర్సుకు గాను మొత్తం ఫీజు రూ. 34లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన విద్యార్థులు రుణ సౌకర్యం పొందవచ్చు.
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు ఉంటుంది. ఒక్కో ప్రశ్నలకు 4మార్కులు చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి ఆన్లైన్, వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో అకడమిక్స్, జనరల్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ను పరిశీలిస్తారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మే 2 చివరితేది. దరఖాస్తు ఫీజు రూ. 3,890 ఉంటుంది. రాత పరీక్ష మే 21న నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలున్నాయి.
వెబ్సైట్ : www.iimrohtak.ac.in