ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు బీటెక్ విద్యతోపాటు లెఫ్టినెంట్ జాబ్ అందించడానికి ఇండియన్ ఆర్మీ ముందుకొచ్చింది. ఇందుకోసం 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదలచేసింది. ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్ స్కోర్ ప్రకారం దరఖాస్తులు షార్ట్లిస్ట్ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ అయిదేళ్ల పాటు కొనసాగుతుంది. జులై 2022 నుంచి శిక్షణ తరగతలు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్ డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం సొంతమవుతుంది. విధుల్లో చేరినవారికి నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది.
ఖాళీలు: 90
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్ 2021 స్కోర్ తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2003 జనవరి 2 కంటే ముందు; 2006 జనవరి 1 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు.
ఇంటర్ మార్క్స్, జేఈఈ స్కోరుతో షార్ట్లిస్ట్
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని, జేఈఈ మెయిన్స్ 2021 రాసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్ స్కోరు ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి ఏప్రిల్లో బెంగళూరులో అయిదు రోజులపాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగా రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్
తొలిరోజు స్టేజ్-1 స్క్రీనింగ్ పరీక్షలో భాగంగా ఇంటలిజెన్స్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టులు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ దశలో సైకలాజికల్, జీటీవో టెస్టులు, ఇంటర్వ్యూ ఉంటాయి. అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు ఎంపికచేస్తారు. అనంతరం విధుల్లోకి తీసుకుంటారు.
ట్రైనింగ్
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఐదేళ్లు ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ- గయలో బేసిక్ మిలిటరీ శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్ ట్రైనింగ్ పుణె, సికింద్రాబాద్, మావ్ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒకచోట నిర్వహిస్తారు. ఇందులో రెండు దశలుంటాయి. ఫేజ్-1 మూడేళ్ల ప్రీ కమిషన్ ట్రైనింగ్, ఫేజ్-2 ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఫేజ్-1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టయిపెండ్ అందుతుంది. మొత్తం శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదా సొంతమవుతుంది. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్ (బీటెక్) పట్టాను జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ అందిస్తుంది. అనంతరం వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.
సాలరీ
లెవెల్-10 మూలవేతనం రూ.56,100తోపాటు మిలటరీ సర్వీస్ పే కింద రూ.15,500 ప్రతి నెలా చెల్లిస్తారు. వీటికి డీఏ, హెచ్ఆర్ఎ, పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికీ ప్రతి నెల రూ.2250 ఎడ్యుకేషన్ ఆలవెన్సు ఇస్తారు. అలాగే వసతి నిమిత్తం ఒక్కొక్కరికీ ప్రతి నెలా రూ.6750 సబ్సిడీ రూపంలో అందిస్తారు. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే వీరు అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని సీటీసీ రూపంలో నెలకు దాదాపు లక్ష రూపాయలకు పైగానే పొందవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్తో మేజర్, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను అందుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులు: ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.
వెబ్సైట్: www.joinindianarmy.nic.in