ఇండస్ట్రీయల్ డెవెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI Bank) 2026–27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,300 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘O’ 1,100 పోస్టులు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ 200 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 19, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో నియామకాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జోన్లో 65 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.
దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న బ్యాంక్ జోన్లలో ఈ నియామకాలు జరగనున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కొచ్చి, లఖ్నవూ, ముంబయి, నాగ్పుర్, పుణె, పట్నా వంటి నగరాల్లో పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 1300
- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘O’ – 1,100 పోస్టులు
- అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ – 200 పోస్టులు
విద్యార్హతలు
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘O’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు ఈ అర్హత వర్తిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ సాధించి ఉండాలి. అదనంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే జోన్కు సంబంధించిన ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవటం, రాయటం తెలిసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు లేదా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
2026 మార్చి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు గరిష్ట వయస్సులో సడలింపు ఇస్తారు.
వేతనం
ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు వేతనం అందుతుంది. బ్యాంకింగ్ రంగంలో మంచి కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తారు. మొదట ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు.
ఆన్లైన్ పరీక్ష సిలబస్
ఆన్లైన్ పరీక్షలో ప్రధానంగా నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెటేషన్ – 60 ప్రశ్నలు (60 మార్కులు)
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ – 40 ప్రశ్నలు (40 మార్కులు)
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 40 ప్రశ్నలు (40 మార్కులు)
- జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్నెస్ / కంప్యూటర్ / ఐటీ – 60 ప్రశ్నలు (60 మార్కులు)
స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష కేంద్రాలు
తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులు.. ఫీజు
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఇతర అభ్యర్థులు రూ.1,050 ఫీజు చెల్లించాలి.
ముఖ్య తేదీలు
- ప్రకటన విడుదల: 06 మార్చి 2026
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 08 మార్చి 2026
- దరఖాస్తులకు చివరి తేదీ: 19 మార్చి 2026
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19 మార్చి 2026
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష: 2026 ఏప్రిల్ 12 (ఉదయం)
అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష: 2026 ఏప్రిల్ 12 (మధ్యాహ్నం)
ఈ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింకులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.





