తెలంగాణ ఉద్యోగ నియామకాలకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ క్రిమిలేయర్.. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు/సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తాము సంపన్న శ్రేణికి చెందినవారము కాదని రెవెన్యూ శాఖ అధికారులు ధృవీకరిస్తూ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను అందజేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ పొందడానికి అర్హతలు ఏమిటి? అనర్హులు ఎవరు? సర్టిఫికేట్ను ఎలా పొందాలనే విషయాలను తెలుసుకుందాం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియామకాల్లో వెనకబడిన తరగతులకు(ఓబీసీ) ప్రస్తుతం 25 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే బీసీల్లో ఉన్న సంపన్నశ్రేణి కుటుంబాలకు రిజర్వేషన్ మినహాయించాలని సుప్రీం కోర్టు ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును వెలువరించింది.
సంపన్నశ్రేణీ క్రీమీలేయర్ ) అనగా?
వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా , విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని ‘ సంపన్నశ్రేణి ‘ ( క్రీమీలేయర్ ) గా పరిగణిస్తారు .
వీరు రిజర్వేషన్ సౌకర్యమును పొందుటకు అనర్హులు. కాబట్టి ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీపడవలసి ఉంటుంది .
ఓబీసీ రిజర్వేషన్కు ఎవరు అనర్హులు..
- రాజ్యాంగంలో పొందుపరచబడిన పోస్టులలో ఉన్నవారి పిల్లలు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు, యూపీఎస్సీ, పీఎస్సీ సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్, అధికార భాషా సంఘ సభ్యులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, ఇతర రాజ్యాంగ పదవులు కలిగిన వారి పిల్లలు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్లు అనర్హులు.
II . సివిల్ ఉద్యోగులు:
- తల్లిదండ్రులిద్దరిలో ఎవరైనా.. ఆల్ ఇండియా సర్వీసులలో డైరెక్టుగా నియామకం పొందినవారు.
- గ్రూప్ -1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు .
- తల్లిదండ్రులిరువురూ గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు .
- తల్లిండ్రులలో ఏ ఒక్కరైనా గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం కాబడి , 40 సం॥ల లోపు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు . 40 సం. ల తర్వాత గ్రూప్ -1 స్థాయికి ప్రమోషన్ పొందినట్లైతే వారి పిల్లలు క్రీమీలేయర్ కింద రారు.
- తల్లిదండ్రులిద్దరు లేదా ఒక్కరైనా గ్రూప్ -3 లేక గ్రూప్ -4 స్థాయిలో తొలుత నియామకం పొంది వారు ప్రమోషన్ ద్వారా ఏ స్థాయికి చేరినా గానీ వారి పిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ సంపన్నశ్రేణిగా పరిగణించబడరు .
III మిలిటరీ మరియు పారామిలిటరీ దళాలు :
ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మరియు పారామిలిటరీలో కల్నల్ స్థాయిలో పనిచేస్తున్న వారి పిల్లలు సంపన్నశ్రేణిగా గుర్తిస్తారు.
IV ప్రొఫెషనల్స్ , వాణిజ్య మరియు వ్యాపార వర్గాలు :
ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు , ఇంజనీర్లు , లాయర్లు , చార్టర్డ్ అకౌంటెంట్లు , ఇన్కంటాక్స్ కన్సల్టెంట్లు , ఆర్కిటెక్టులు , కంప్యూటర్ ప్రొఫెషనల్స్ , సినీ ఆర్టిస్టులు , రచయితలు , జర్నలిస్టులు , క్రీడాకారులు మొదలగువారు . వారి ఆదాయాన్ని బట్టి సంపన్నశ్రేణిగా గుర్తించబడతారు . అనగా , మూడు సంవత్సరాల పాటు వరుసగా వారి వార్షికాదాయం నిర్దేశించబడిన ఆదాయ పరిమితిని దాటితే వారి పిల్లలు ‘ సంపన్నశ్రేణి’గా గుర్తించబడతారు . ప్రస్తుతం కేంధ్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన వార్షికాదాయ పరిమితి రూ .8.00 లక్షలుగా ఉంది.
V. ఆస్తిపరులు :
- సాగునీటి సౌకర్యం కలిగి , లాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం భూమిలో 85 శాతం భూమి ఉన్న యెడల, వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు .
- ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం కలది , కొంత సాగునీటి సౌకర్యం లేనిది అయిన యెడల , సాగునీటి సౌకర్యం గల భూమి యాక్ట్ ప్రకారం ఉండాల్సిన భూమిలో 40 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడే, మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మార్చి , రెండింటినీ కలిపి చూసి ఉన్న భూమిలో 80 % కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు .
- వ్యవసాయ భూమిలో మామిడి, బత్తాయి, నిమ్మ, కాఫీ , టీ , రబ్బరు మొదలగు తోటలు ఉన్న వాటిని సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తించడం జరుగుతుంది. ఈ భూయజమానుల పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించబడటం జరుగుతుంది .
- పట్టణాలలో ఖాళీ స్థలాలు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఆస్తి పన్ను చెల్లించేవారు. పరిమితి మించి ఆస్తులు కలిగిన వారి పిల్లలు కూడా క్రిమిలేయర్ కిందకు వస్తారు.
పైన తెలిపిన కేటగిరీలు మినహా వార్షికాదాయం తక్కువగా ఉన్న వెనకబడిన తరగతుల వారందరికీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పొందడానికి అర్హులు. తహసీల్దార్ కార్యాలయంలో నాన్ క్రిమిలేయర్ కోసం దరఖాస్తు సమర్పించేటప్పుడు ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్తో పాటు ఆధార్, రేషన్కార్డు, లేదా ఇతర గుర్తింపు కార్డులను జత చేయాలి. రెవెన్యూ సిబ్బంది వాటిని పరిశీలించి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను అందజేస్తారు.