Current Affairs Telangana April 2020
తెలంగాణ
వార్తల నిర్ధారణకు పోర్టల్
సామాజిక మాధ్యమాల్లో చలామణి అవుతున్న వార్తల నిర్ధారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను రూపొందించింది. http://factcheck.telanagana.gov.in ద్వారా ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించనుంది.
కొవిడ్19 మానిటరింగ్ యాప్
తెలంగాన ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కొవిడ్–19 మానిటరింగ్ సిస్టం యాప్ను ప్రారంభించింది. వ్యాధి గ్రస్తులను గుర్తించడం, ఆచూకి తెలుసుకోవడం, బాధితులపై నిఘా పెట్టడం, ప్రభుత్వానికి సమాచారం అందించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. జియోట్యాగింగ్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ veera smart health care అనే స్టార్టప్ కంపెనీ రూపొందించింది.
జై కిసాన్ రైళ్లు
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున ఆహారపదార్థాలను, నిత్యావసర వస్తువులను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ‘జై కిసాన్’ పేరుతో రెండు ప్రత్యేక గూడ్స్ రైళ్లను ప్రారంభించింది. మొదటి రైలు డోర్నకల్ జంక్షన్ నుంచి సదరన్ రైల్వే జోన్లోని సెవురు, చెట్టినాడ్ స్టేషన్ల వరకు వెళ్తుంది. రెండో రైలు డోర్నకల్ జంక్షన్ నుంచి సదరన్ రైల్వే జోన్లోని దిండిగల్, ముడియపక్కమ్ స్టేషన్లకు చేరుకుంటుంది.
టీఎస్ కాప్
లాక్డౌన్ టైంలో స్థానిక ప్రజలు నిత్యావసరాల కోసం 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించకుండా నిరోధించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం పేరుతో కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఎవరైన వ్యక్తి రోడ్డెక్కినప్పుడు పోలీసులు ఆ వ్యక్తి పేరు, బైక్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేస్తారు. వ్యక్తి మరికొంత దూరం వెళితే అక్కడి పోలీసులు వివరాలు సేకరిస్తారు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా ఆ వ్యక్తి ప్రయాణ పరిధి 3 కిలోమీటర్లు దాటితే కేసు నమోదు చేస్తారు.
శ్రీరాముల సత్యనారాయణ
ప్రముఖ నాటకరంగ కళాకారుడు శ్రీరాముల సత్యనారాయణ హైదరాబాద్లో మరణించారు. వ్యత్తిరీత్యా వ్యవసాయ అధికారి అయిన సత్యనారాయణ ‘పరివర్తన’ నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశారు. 1990 దశకంలో అక్షరాస్యత, అక్షర ఉజ్వల కార్యక్రమాల ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన మార్గదర్శి సినిమా 1993లో జాతీయ సమైక్యత నంది పురస్కారం గెలుచుకుంది.
సీఎస్ రావు
ప్రముఖ సినీ, నవలా, నాటక రచయిత సీఎస్ రావు మార్చి 14న హైదరాబాద్లో కన్నుమూశారు. ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి సినిమాలకు కథలు అందించారు. ఇందులో ఊరుమ్మడి బతుకులు చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఇతని ప్రముఖ నవల అగ్నిపర్వతం. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షరామం.
––––––––––––