Current Affairs International
ఇంటర్నేషనల్
గ్రీసు తొలి మహిళా ప్రెసిడెంట్
గ్రీసు తొలి మహిళా అధ్యక్షురాలిగా కాథిరినా సకెల్లొరొపౌలో ఎన్నికైంది. ఏప్రిల్లో ఆమె 13 అధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టనుంది. ఇందులో ఆమె ఐదేండ్ల పాటు కొనసాగనుంది. మానవహక్కుల కార్యకర్తగా పనిచేసిన కాథిరినా రాజ్యాంగం, పర్యావరణ చట్టాలపై పట్టున్న నిష్ణాతురాలుగా పేరుంది.
వరల్డ్ ఎడ్యుకేషన్ డే
ప్రపంచ విద్యా దినోత్సవాన్ని యునెస్కో ప్రధాన కార్యాలయం పారిస్లో, యూఎన్వో హెడ్క్వార్టర్స్ న్యూయార్క్లో జనవరి 24న నిర్వహించారు. ‘లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పర్టీ అండ్ పీస్’ అనే థీమ్తో ఈ ఉత్సవాలను నిర్వహించింది. ప్రపంచదేశాల నడుమ శాంతి, అభివృద్ధిని నెలకొల్పడంలో విద్యకున్న ముఖ్యపాత్రను ఉద్దేశించి 2018 డిసెంబర్ 3న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం మేరకు 2019లో తొలిసారి జనవరి 24న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని నిర్వహించింది.
మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్
మహాత్మా గాంధీ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్లో ‘మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్’ను కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ జనవరి 21న ప్రారంభించారు. నైగర్తో పాటు ఉత్తరాఫ్రికా దేశం ట్యునిషియాను సందర్శించిన తొలి భారత విదేశాంగ మంత్రిగా జైశంకర్ ప్రత్యేకత పొందారు. ఆ సందర్భంగా నైగర్కు రవాణా, విద్యుత్, సోలార్ విద్యుత్, తాగునీటి ప్రాజెక్టుల కోసం 96.54 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇండియా ప్రకటించింది.
ఖరీదైన నగరం హాంకాంగ్
స్విట్జర్లాండ్ ప్రైవేటు బ్యాంక్ ‘జులియస్ బేయర్’ 28 దేశాలతో రూపొందించిన ‘గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్స్టైల్’ రిపోర్ట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచింది. షాంఘై రెండో, టోక్యో, మూడో స్థానంలో నిలిచాయి. సింగపూర్, తైపీలు ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఇందులో మొత్తం 10 ఆసియా, 12 యూరప్, మధ్య తూర్పు ఆఫ్రికా దేశాలు, 6 అమెరికా ఖండానికి చెందిన దేశాలున్నాయి. ఇందులో అతి తక్కువ జీవన వ్యయం గల నగరంగా ముంబయి 28వ స్థానంలో నిలిచింది.
సురినామ్కు లైన్ ఆఫ్ క్రెడిట్
దక్షిణ అమెరికా దేశమైన సురినామ్కు ఇండియా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ (ఎక్సిమ్) బ్యాంక్ 35.80 మిలియన్ డాలర్ల(రూ.250కోట్లు)ను లైన్ ఆఫ్ క్రెడిట్గా అందజేస్తుంది. దీనిని గ్రామీణ విద్యుద్దీకరణ కోసం ఉపయోగించనుంది. దీంతోపాటు ఇప్పటికే 9 ప్రాజెక్టులకు అందించిన 124.98 మిలియన్ డాలర్ల(రూ.890కోట్లు) రుణ కాలాన్ని పొడిగించింది. ఎక్సిమ్ బ్యాంక్ 1982లో ముంబయిలో ఏర్పాటైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతి తక్కువ వడ్డీతో అందించే రుణమే లైన్ ఆఫ్ క్రెడిట్.
రోడ్డు విస్తరణ ఒప్పందం
బంగ్లాదేశ్లోని అషుగంజ్ రివర్ పోర్టు నుంచి అఖేరాకు గల 50.58 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాన్ని 4 లైన్ల రోడ్డుగా మార్చేందుకు ఇండియా, బంగ్లాదేశ్ల మధ్య జనవరి 24న పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. బంగ్లాదేశ్ రోడ్లు, హైవేల శాఖ, ఇండియాకు చెందిన అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లు 39 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని దర్హన్ వరకు అభివృద్ధి చేశాయి. దర్హన్ నుంచి అఖేరా వరకు మిగిలిన మార్గాన్ని ఇండియా, బంగ్లాదేశ్లు జాయింట్ వెంచర్ పద్ధతిలో అభివృద్ధిపర్చాయి. ప్రస్తుతం ఈ మార్గాన్నే నాలుగు లైన్లుగా మార్చాలని నిర్ణయించాయి.
డెన్మార్క్, న్యూజిలాండ్ ఫస్ట్
ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ 2019 గణాంకాల ఆధారంగా విడుదల చేసిన ‘ప్రపంచ అవినీతి సూచీ’లో అతి తక్కువ అవినీతితో డెన్మార్క్, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి. ఫిన్లాండ్ మూడో స్థానంలో ఉంది. బెనిన్, చైనా, ఘనా, మొరాకో దేశాలతో కలిసి ఇండియా 80వ ర్యాంక్ దక్కించుకుంది. ఆఫ్రికా దేశమైన సోమాలియా ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించారు.
ఇండియాకు 78వ ర్యాంకు
2 కన్నా తక్కువ వయసున్న పిల్లలకు పాలపట్టడం అనే అంశం ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూపొందించిన నివేదికలో తల్లిపాలు బాగా పడుతున్న దేశాలలో శ్రీలంక మొదటిస్థానంలో ఉంది. క్యూబా రెండు, బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇందులో ఇండియాకు 78వ స్థానం దక్కింది. అన్నింటికి చివరిస్థానంలో లిబియా ఉంది. మొత్తం 97 దేశాలతో రూపొందించిన ఈ రిపోర్టులో బాగా పాలు పట్టడం ఆధారంగా రెడ్, పసుపు, నీలి, ఆకుపచ్చ రంగు సూచికలుగా దేశాలను విభజించారు. 2025 నాటికి పాలు పట్టే తల్లుల సంఖ్యను 41 నుంచి 50శాతానికి పెంచాలని డబ్ల్యూహెచ్వో లక్ష్యంగా పెట్టుకుంది.
కామన్వెల్త్ దేశంగా మాల్దీవులు
కామన్వెల్త్ కూటమిలో 54వ దేశంగా మాల్దీవులు ఫిబ్రవరి 1న చేరింది. తొలిసారిగా 1982లో కామన్వెల్త్ కూటమిలో చేరినప్పటికీ 2016లో ప్రెసిడెంట్అబ్దుల్లా యమీన్ కాలంలో వైదొలిగింది. 2019 ఏప్రిల్లో మాల్దీవులను సందర్శించిన కామన్వెల్త్ పరిశీలకుల బృందం ఆ దేశం పట్ల సానుకూలత వ్యక్తం చేయడంతో సభ్య దేశంగా మరోసారి చేరింది. జూన్ నుంచి 28 వరకు రువాండాలోని కిగాలిలో జరగనున్న కామన్వెల్త్ సదస్సులో మాల్దీవులు పాల్గొననుంది.
ట్రాఫిక్ ఇండెక్స్
డచ్కు చెందిన బహుళజాతి సంస్థ టామ్టన్ ప్రకటించిన ట్రాఫిక్ ఇండెక్స్లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల నగరంగా బెంగళూరును గుర్తించింది. మనీలా(ఫిలిప్పైన్స్) రెండు, బోగొటా(కొలంబియా) మూడో స్థానంలో నిలిచాయి. టాప్–10లో ఇండియా నుంచి మూడు నగరాలున్నాయి. ఈ జాబితాలో ముంబయికి నాలుగో ర్యాంకు, పుణెకు ఐదో ర్యాంకు, న్యూఢిల్లీకి ఎనిమిదో ర్యాంకు దక్కాయి.
12వ దక్షిణాసియా సదస్సు
పొరుగుదేశాలతో ఆర్థిక సహకారం, అభివృద్ధి, రాజకీయ సమీకరణాల బలోపేతం లక్ష్యంగా జనవరి 28, 29 తేదీల్లో 12వ దక్షిణాసియా సదస్సు నిర్వహించారు. న్యూఢిల్లీలోని ‘ది ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్లో ఇది జరిగింది. ‘ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్; పాలసీ రీజినల్ పర్సెప్షన్’ అనే థీమ్తో సాగింది. ఈ సదస్సులో దక్షిణాసియా దేశాలతోపాటు మయన్మార్ పాల్గొంది.
ఫ్రీ ఎంట్రీ రద్దు
ఇండియన్ టూరిస్టులకు భూటాన్ దేశంలోకి ఇప్పటివరకు లభిస్తున్న ఫ్రీ ఎంట్రీని జులై నుంచి రద్దు చేస్తున్నట్లు భూటాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాతో పాటు మాల్దీవులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే టూరిస్టుల నుంచి ఇక రోజుకు రూ.1200 చొప్పున వసూలు చేయనున్నారు. దీని ద్వారా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని భూటాన్ నిర్ణయించింది. ఐదేండ్ల లోపు పిల్లలకు ఉచితంగా, 6 నుంచి12 ఏండ్ల వారికి రూ.600, పెద్దవాళ్లకు రూ.1200 వసూలు చేయనున్నారు. ఇతర దేశాల వారు ప్రవేశించడానికి 250 డాలర్లు, ఆ తర్వాతి రోజు 65 డాలర్లలోపు చెల్లించాలి.
మిడతల ‘ఎమర్జెన్సీ’
పంట పొలాలపై మిడతల దాడిని నియంత్రించడానికి పాకిస్థాన్, సోమాలియా దేశాలు నేషనల్ ఎమర్జెన్సీని విధించాయి. దీంతో తొలిసారిగా ఈ విధమైన ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచంలోనే తొలి దేశంగా సోమాలియా నిలిచింది. ఆహార పంటలను మిడితలు విచ్ఛిన్నం చేయడంతోపాటు, ఆహార కొరత పెరగడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన కీటకాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అరికట్టడానికి రూ.730కోట్లు అవసరం కానున్నాయి.
నార్వేతో 4 ఒప్పందాలు
పరిశోధన, ఉన్నత విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఇండియా, నార్వేల మధ్య 4 పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరాయి. నార్వే విద్య, పరిశోధన శాఖ మంత్రి ఎన్నిలైన్ వోల్డ్, భారత్లో నార్వే భారత రాయబారిగా పనిచేస్తున్న హన్స్జాకబ్ ఫ్రైడెన్లాండ్ సమక్షంలో సంతకాలు చేశారు. ఐఐటీ మండి(హిమాచల్ ప్రదేశ్), నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య ఒకటి, ఐఐటీ జమ్మూ, నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య రెండు పరిశోధన ఒప్పందాలు కుదిరాయి. ఐఐటీ ఢిల్లీ–ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే మధ్య ఆరోగ్య రంగం, వ్యాధి నిర్ధారణ, నీటి నిర్వహణ, నానో టెక్నాలజీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరాయి. నాలుగో ఒప్పందం ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే మధ్య విద్యార్థుల, ఉపాధ్యాయుల మార్పిడి ఒప్పందాలు కుదిరాయి.