వ్యక్తులు
రాఫెల్ తొలి పైలట్గా హిలాల్ అహ్మద్
రాఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్గా ఎయిర్ కామడొర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ నిలిచారు. కశ్మీర్కు చెందిన హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుంచి జూలై 27న బయలుదేరిన తొలి బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, మిగ్ 21, కిరణ్ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్ అవర్స్ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర ఆయనకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఘనత సాధించారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్లో హిలాల్ జన్మించారు. ఆయన తండ్రి మొహమ్మద్ అబ్దుల్లా రాథోడ్ జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్ను హిలాల్ సాధించారు.
అర్చనా సొరెంగ్
పర్యావరణ మార్పులపై సూచనలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరిస్ ఏర్పాటు చేసిన ఏడుగురు ప్రతినిధులు బృందంలో ఎంపికైన భారత మహిళ అర్చనా సొరెంగ్. 2019 సెప్టెంబర్ 21న న్యూయార్క్లో జరిగిన యువ పర్యావరణ సదస్సు సందర్భంగా తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
షాహిల్ సేత్
2011 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన షాహిల్ సేత్ బ్రిక్స్ దేశాల చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(సీసీఐ) సలహాదారుడిగా నియమితులయ్యారు. ఇది ఆర్థికేతర, స్వచ్ఛంద, జీతభత్యాలు లేని నియామకం. 2020–30వరకు సేత్ ఈ పదవిలో కొనసాగనున్నారు.
కళానారాయణ స్వామి
భారత సంతతికి చెందిన నర్సు కళా నారాయణ స్వామి కోవిడ్ –19పై చేసిన పోరాటంలో భాగంగా సింగపూర్ ప్రెసిడెంట్ ట్రోఫీకి ఎంపికైన ఐదుగురిలో నిలిచారు. ట్రోఫీతో పాటు ఒక్కో వ్యక్తికి 10వేల సింగపూర్ డాలర్లు అందజేయనున్నారు.
స్టువార్డ్ బ్రాడ్
టెస్ట్ మ్యాచ్లోల్లో 500 వికెట్లు తీసిన ఏడో ఆటగాడిగా స్టువార్డ్ బ్రాడ్ నిలిచాడు. వెస్టిండిస్తో జరిగిన టెస్టులో బ్రాత్వైట్ను ఔట్ చేయడంతో 140 టెస్టుల్లో ఈ ప్రత్యేకతను పొందాడు. ముత్తయ్య మురళీధరన్(800), వార్న్(708), అనిల్ కుంబ్లే(619), అండర్సన్(589), మెక్గ్రాత్(563), కోట్ని వాల్ష్(519)లు టెస్టుల్లో 500పైగా వికెట్లు సాధించిన బౌలర్లు.
రావి కొండల్రావు మృతి
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, జర్నలిస్ట్ రావికొండల్రావు జులై 28న మరణించారు. ఈయన రాసిన ఆత్మకథ నాగావలి నుంచి మంజీర వరకు’ స్వయంవరం, కుక్కపిల్ల దొరికింది, ప్రొఫెసర్ పరబ్రహ్మం, పట్టాలు తప్పిన బండి రచనలు ప్రసిద్ధి చెందినవి , పెండ్లి పుస్తకం సినిమాకు నంది అవార్డు వచ్చింది.
ఉప్పుటూరి సాంబశివరావు కన్నుమూత
అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ధీశాలి, సామాజిక పరివర్తకుడు, దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా.(ఉప్పుటూరి సాంబశివరావు) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఉ.సా.(70) జూలై 25న హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో ఆయన జన్మించారు. ప్రజాతంత్ర విద్యార్థి సంఘం(డీఎస్.వో)లో పనిచేసిన అనంతరం యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీలో చేరి నాయకుడిగా ఎదిగారు. 1982 నుంచి 1986 వరకు నల్లగొండ జిల్లా-కరువు పోరాటంలో చురుైకై నపాత్ర పోషించిన ఆయన గిరిజన హక్కుల కోసం పోరాడారు.
లీ హసెన్ లూంగ్
సింగపూర్ ప్రధానిగా లీ సేన్ లోంగ్ మరోసారి ఎన్నికయ్యారు. 2014 ఆగస్టు 12 నుంచి కొనసాగుతున్న లీ పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన వ్యక్తి. పార్లమెంట్లో మొత్తం 105 సీట్లు ఉండగా 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పీఏపీకి 83 సీట్లు లభించాయి. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీకి 10 సీట్లు గెలుచుకుంది. 1965 లో మలేషియా నుంచి స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి సింగపూర్లో పీపుల్స్ యాక్షన్ పార్టీనే అధికారంలో ఉంది.
ముస్తాక్ అహ్మద్
జాతీయ క్రీడా నియమావళి, పదవీకాలం, నిబంధనలు ఉల్లంఘించినందున క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాజీనామా చేసిన హాకీ ఇండీయా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్. ఈయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా జ్క్షానేందర నిగోంబమ్ ఎన్నికయ్యారు.
అండ్ర్జెజ్ దుడా
పొలాండ్ దేశ అధ్యక్షుడిగా అండ్ర్జెజ్ దుడా తిరిగి ఎన్నికయ్యారు. 2015 ఆగస్టు నుంచి కొనసాగుతున్న ఈయన జులై 13న జరిగిన ఎన్నికల్లో 51.2 శాతం ఓట్లు సాధించారు. లా అండ్ జస్టిస్ పార్టీకి చెందిన దుడా. ప్రత్యర్థి వార్సానగర్ మేయర్ ట్రజౌ స్కోవ్స్కీపై విజయం సాధించారు.
ఇంజేటి శ్రీనివాస్
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) తొలి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంజేటి శ్రీనివాస్ జులై 06న బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో కార్పొరేట్ శాఖా సెక్రటరీగా 2020, మే 31న పదవీ విరమణ పొందిన ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు ఐఎఫ్ఎస్సీఏ గాంధీనగర్ కేంద్రంగా 2020, ఏప్రిల్ 27న ఏర్పాటైంది. ఇది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్లో జరిగే అన్ని లావాదేవీలను ఇది పర్యవేక్షిస్తుంది.
శ్రీనాథ్ రెడ్డి
కోవిడ్–19 వలన మానవ హక్కులు ఏ విధంగా ప్రభావితమవుతున్నాయని పరిశీలించడానికి జాతీయ మానవహక్కుల సంఘం శ్రీనాథ్రెడ్డి అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనాథ్ కమిటి కేంద్రం, రాష్ట్రాలు అమలు చేయాల్సిన విధానపరమైన సూచనలతో రపోర్ట్ అందిస్తుంది.
ఆర్నబ్ చౌదరి
లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డు–2020కు ఆర్నబ్ చౌదరి మరణానంతరం ఎంపికయ్యారు. అర్జున్, రివారియర్ ప్రిన్స్ చిత్రాలకు యానిమేషన్స్ అందించిన ఇతను 2019 డిసెంబర్ 25న మరణించారు.
రోషిణి నాడార్
హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్(హెచ్సీఎల్) నూతన చైర్మన్గా రోషినాడార్ జులై 17న బాధ్యతలు స్వీకరించారు. శివనాడార్ స్థానంలో ఈ నియామకం జరిగింది. 1976 ఆగస్టు 11న ఏర్పాటైన హెచ్సీఎల్ ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది.
లాల్జిటాండన్
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జి టాండన్ జులై 21న మరణించారు. 2003 నుంచి 07 వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేతగా, 2009–14 వరకు లక్నో ఎంపీగా వ్యవహరించిన టాండన్ 2018–19 వరకు బిహార్ గవర్నర్గా, 2019 జులై 29 నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు.
ఎలైస్ ఫాక్ఫాక్
ట్యూనిషియా ప్రధాని ఎలైస్ ఫాక్ఫాక్ అధికార దుర్వినియోగం ఆరోపణలతో జూన్ 15న రాజీనామా చేశారు. 2020 ఫిబ్రవరి 17న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇతను డెమెక్రటిక్ ఫోరం ఫర్ లేబర్ అండ్ లిబర్టీస్ పార్టీకి చెందిన వ్యక్తి
జస్టిస్ యు.యు.లలిత్
సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు.లలిత్ నూతన సభ్యుడిగా చేరారు. 2022 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ ఆర్.భానుమతి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ లలిత్ స్థానం సంపాదించారు. ప్రస్తుతం కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ఉన్నారు.
దాశరథి అవార్డు
ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య పేరుతో అందిస్తున్న అవార్డు 2020 ఏడాదికి తిరువగిరి రామానుజయ్య కు లభించింది. ఇతను యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బేగంపేటకు చెందిన వ్యక్తి. ఈయన రాసిన ప్రముఖ రచనలు బాల వీర శతకం, కొవ్వొత్తి, ఆక్షర ధార, ముక్తాకాలు, నిరాజనం మొదలైనవి. 2015 లో ప్రారంభమైన దాశరథి అవార్డు విలువ రూ. లక్షా 116 . తొలి గ్రీహిత తిరుమల శ్రీనివాసా చార్యులు.