Current Affairs National INDIA
నేషనల్
సూరజ్ఖండ్ క్రాఫ్ట్ మేళా
ప్రపంచంలోనే అతిపెద్ద హస్తకళల ఉత్సవం సూరజ్ఖండ్ క్రాఫ్ట్మేళా 34వ ఎడిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సూరజ్ఖండ్లో ఫిబ్రవరి 1న ప్రారంభించారు. భారత పర్యాటక, జౌళి, విదేశీ వ్యవహారాల శాఖలు, హర్యానా పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాయి. హస్తకళలు, చేనేత కళల సంస్కృతిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించడం ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశం.
విలేజ్ ఇండస్ట్రీస్కి ‘స్ఫూర్తి’
కొబ్బరిపీచు, ఖాదీ వస్త్రాలు, గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ ఫిబ్రవరి 3న స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్(ఎస్ఎఫ్యూఆర్టీఐ) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 క్లస్టర్స్ ఏర్పాటు చేసి 50వేల మందికి వృత్తి నైపుణ్యాలు పెంపొందిస్తారు. నైపుణ్యాల అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్య రంగంలో నూతన భాగస్వామ్యాలు 5 సంవత్సరాల కాలంలో పెంపొందించి స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2005లో తీసుకొచ్చిన ఈ పథకానికి ఇటీవలి బడ్జెట్లో రూ.2.3కోట్లు కేటాయించింది.
బీమా పెంపు
బ్యాంకు డిపాజిట్లపై బీమా సొమ్మును రూ. లక్ష నుంచి 5 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇది ఫిబ్రవరి 4 నుంచి అమలులోకి వచ్చింది. డిపాజిట్ దారుల రక్షణ కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని 1993 లో రూ. లక్షతో ప్రారంభించారు. ఖాతాదారులు ఎలాంటి రుసుం చెల్లించకుండా అన్ని ప్రాంతీయ, విదేశీ బ్యాంకులలో ఈ సదుపాయం పొందవచ్చు. డిపాజిట్ చేసిన ప్రతి రూ.100 నుంచి రూ.12 పైసలు బ్యాంకులు ఆర్బీఐకి చెల్లిస్తాయి.
జనసేవక్
మున్సిపల్ కార్పొరేషన్లలో రేషన్ కార్డులు, సీనియర్ సిటిజన్ ఆరోగ్య కార్డులు ఇంటి వద్దకే అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 4 న జనసేవక్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీంలో భాగంగా 11 డిపార్ట్మెంట్లలో 53 సర్వీసులను అందించనున్నారు. ఆన్లైన్ ద్వారా రూ. 115 చెల్లించిన వారికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ సేవలు అందిస్తారు.
8 రాష్ట్రాలకు జరిమానా
గ్రామాల్లో సత్వర న్యాయ సహాయం అందించేందుకు గ్రామ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ పలు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2008లో చేసిన చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా 2500 గ్రామ కోర్టులు అవసరం ఉండగా 208 మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు చర్యలు చేపట్టని అసోం, చండీగఢ్, గుజరాత్, హర్యానా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా విధిస్తూ నాలుగు వారాల్లో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
ఐసీసీ టెస్ట్ర్యాంకింగ్స్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఫిబ్రవరి 1న టెస్ట్ మ్యాచ్ల ర్యాంకులను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ 910 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్స్(న్యూజిలాండ్), చటేశ్వర్ పుజారా(ఇండియా) తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా నుంచి అజింక్య రహానే, జస్ప్రీత్ బుమ్రా ర్యాంకింగ్లో మెరుగయ్యారు.
క్యాబ్ ప్రెసిడెంట్గా అవిషేక్
క్రికెట్అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ కొత్త అధ్యక్షుడిగా అవిషేక్ దాల్మియా నియామకమయ్యారు. అవిషేక్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమారుడు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహషీష్ గంగూలీ క్యాబ్ ముఖ్య కార్యదర్శిగా ఎన్నికైయ్యారు.
బీసీసీఐ సలహా మండలి
బీసీసీఐ ఏడాది కాలనికి సలహా మండలిని ఏర్పాటు చేసింది. 1983లో వరల్డ్కప్ విజయంలో కీలకపాత్ర వహించడంతో పాటు కోచ్గా, సెలక్టర్గా వ్యవహరించిన మదన్లాల్తో పాటు 2007లో టీ20 వరల్డ్ కప్ విజయానికి కృషిచేసిన రుద్రప్రతాప్సింగ్, మాజీ మహిళా క్రికెటర్ సులక్షన నాయక్లను కమిటీ సభ్యులుగా నియమించింది.
రాష్ట్ర విపత్తుగా కరోనా
చైనాలో ప్రారంభమై సుమారు 18 దేశాలకు విస్తరించిన ‘నావల్ కరోనా వైరస్’ను కేరళ ప్రభుత్వం ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించింది. కేరళలో ఇప్పటికే 3 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
సంప్రీతి–IX
ఇండియా, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 9వ ‘సంప్రీతి’ సైనిక విన్యాసాలు ఫిబ్రవరి 3న మేఘాలయాలోని ఉమ్రెయ్లో ప్రారంభమయ్యాయి. రెండు దేశాల ద్వైపాక్షిక, రక్షణ సహకార ప్రయత్నాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి దేశం నుంచి142 జవాన్లు పాల్గొంటారు. ఇండియా నుంచి 20 బిహార్ రెజిమెంట్ పాల్గొంటుండగా, బంగ్లాదేశ్ నుంచి 42 రెజిమెంట్ ఇందులో పాల్గొంది. ఫిబ్రవరి 16 వరకు జరగనున్న ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం ఉగ్రవాదాన్ని నిరోధించడం.
హెల్త్ ఎమర్జెన్సీ
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్వో) కరోనా వైరస్ను జనవరి 31న హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనాలో ఇప్పటికే 400పైగా మరణాలు, 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 దేశాలలో 98 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా చైనా తర్వాత ఫిలిప్పైన్స్లో తొలి మరణం సంభవించింది.
ఐ బాక్స్
దేశంలో తొలిసారిగా ఖాతాదారులకు 24*7 సర్వీస్ లు అందించేందుకు ఐసీఐసీఐ ముంబయి ఆఫీసులో ‘ఐబాక్స్’ ను ప్రారంభించింది. దీని ద్వారా సెలవు దినాల్లోనూ డెబిట్, క్రెడిట్ కార్డులను, చెక్బుక్లను బ్యాంక్ సిబ్బంది సాయం లేకుండా కేవలం ఓటీపీ సహాయంతో పొందవచ్చు.
అత్యధిక డిజిటల్ పేమెంట్స్
జనవరిలో అత్యధిక డిజిటల్ పేమెంట్లు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2019 డిసెంబర్లో 25.64 కోట్ల లావాదేవీల ద్వారా 2.10లక్షల కోట్ల నగదు మార్పిడి కాగా, జనవరిలో 25.95 కోట్ల లావాదేవీలతో 2.16 కోట్ల నగదు మార్పిడి జరిగింది. ఇవి యూపీఐ(యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఐఎంపీఎస్( ఇమిడియేట్ పేమెంట్ సర్వీస్), భీమ్(భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ) ద్వారా జరిగాయి.
వరల్డ్ క్యాన్సర్ రిపోర్ట్
ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఇండియాలో ప్రతి పదిమందిలో ఒకరు క్యాన్సర్తో బాధపడుతుండగా, ప్రతి 15మందిలో ఒకరు మరణిస్తున్నారని పేర్కొంది. రాబోయే 20 ఏండ్లలో 60శాతం, 2040 నాటికి 81 శాతం క్యాన్సర్ తీవ్రత పెరగనుంది. 2018లో 7,84,800 మంది మరణించగా, 2.26 మిలియన్ల మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు.
మాట్లా అభియాన్
తీరప్రాంతంలో భద్రతపై స్థానికులకు అవగాహన కల్పించేందుకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు కోల్కతా పరిధిలోని సుందర్బన్ రీజీయన్లో ‘మాట్లా అభియాన్’ పేరుతో భారత నావికా దళం విన్యాసాలు నిర్వహించింది. సుందర్బన్స్లోని మాట్ల నది వెంట హేమ్నాగర్ వరకు వెళ్లే రెండు నావికాదళ పడవలను జెండా ఊపి ప్రారంభించారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ వాణిజ్య ప్రోటోకాల్ మార్గం ఇది. సుందర్బన్స్ డెల్టాలోని నావిగేషనల్ సంక్లిష్టతలపై అవగాహన కలిగించారు.
లార్డ్ జే పుస్తకం
ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన పాప్ సింగర్ ‘లార్డ్ జే’ తన ఆత్మకథను ‘లార్డ్ జే; లార్డ్ ఆఫ్ అనానమిటీ’ పేరుతో వెలువరించారు. పేరు తెలుపని, సొంత ఉనికిని ఇప్పటివరకు వెలువరించని ఇతనిని లాస్ఏంజిల్స్ అభిమానులు ‘లార్డ్ జే’గా తొలిసారి వెలువరించారు.
గౌరీ లంకేష్ అవార్డు
2017లో హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ స్మారకార్థం అందించే ‘గౌరీ లంకేష్ ప్రజాస్వామ్య భావజాలం అవార్డు’ 2019 ఏడాదికి జమ్మూకాశ్మీర్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యూసఫ్ జమిల్కు లభించింది. 2018లో స్థాపించిన ఈ అవార్డు కింద రూ.లక్షను నగదు బహుమతిగా అందిస్తారు. ఈ అవార్డు తొలిసారిగా కార్టూనిస్టు పి.మహమూద్కు లభించింది.
వహీదాకు కిశోర్ సమ్మాన్
ప్రముఖ బాలీవుడ్ వెటరన్ నటి వహీదా రహమాన్కు ‘జాతీయ కిశోర్ కుమార్ సమ్మాన్ అవార్డు’ను 2018 ఏడాదికి అందుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందించే ఈ అవార్డును 2019 సంవత్సరానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అందుకున్నారు. కిశోర్ కుమార్ వర్థంతి సందర్భంగా అక్టోబర్ 13న వహీదా రహమాన్ అందుకోనందున ఆ రాష్ట్ర సాంస్కృతిక మంత్రి డాక్టర్ విజయలక్ష్మి సాధో ఫిబ్రవరి 3న అందించారు. ఈ అవార్డు కింద మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.2లక్షల నగదు అందిస్తుంది.
ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్
ముంబయిలోని నెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన 16వ ముంబయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో గోల్డెన్ కోచ్ అవార్డును బ్రెజిలియన్ చిత్రం ‘బాబెంకో; టెల్ మి వెన్ ఐ డై’ అనే చిత్రానికి లభించింది. సిల్వర్ కోచ్ అవార్డు మరాఠీ చిత్రం పావ్సచ్చా నిర్బింద్కు, సిల్వర్ కోచ్ (యానిమేషన్) అవార్డు పనన్గట్టు నారి(ఇండియా), సుజన్నే(జర్మనీ) చిత్రాలకు సంయుక్తంగా లభించింది.
32వ ప్రగతి సదస్సు
జనవరి 22న ఢిల్లీ కేంద్రంగా జరిగిన ప్రగతి(ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సదస్సు 32వ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టులను పరిశీలించి నియంత్రించేందుకు 2015లో ఏర్పడింది. ఈ సదస్సులో భాగంగా మోడీ 2015 మే 9 న కోల్కతా కేంద్రంగా ప్రారంభమైన ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన పథకాలను సమీక్షించారు. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్తో పోలిసింగ్ కోసం ఉద్దేశించిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్పై రివ్యూ చేశారు.
సెయిల్ సర్కీస్ స్కీం
సెయిల్ ఉద్యోగుల పరోపకార కార్యక్రమాలను ప్రోత్సహించడం లక్ష్యంగా జనవరి 22న సెయిల్ సర్వీస్ స్కీం (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంప్లాయి రెండెరింగ్ వలంటరిజం అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్) ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. వివిధ వాటాదారుల మధ్య కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు.
ఈఎంఐ కార్డులు
రోగులకు రూ.4 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తూ అపోలో హాస్పిటల్స్ ఈఎంఐ కార్డులను ప్రవేశపెట్టింది. దీనికోసం బజాజ్ ఫిన్సివ్తో ప్రత్యేక ఒప్పందం కుదర్చుకుంది. 12 నెలల వరకు ఈఎంఐ అవకాశం ఉండే దీని ద్వారా 600 వ్యాధులకు చికిత్స పొందవచ్చు. దీంతోపాటు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుంది.
క్రిషక్ దుర్ఘటన కల్యాణ్యోజన
ప్రమాదవశాత్తు మరణించిన, వైకల్యం పొందిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించేందుకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కృషక్ దుర్ఘటన కల్యాణ్ యోజన’ పథకాన్ని ప్రకటించింది. 18 నుంచి 70 ఏండ్ల మధ్య వయసున్న వారికి ఈ స్కీం వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన 45 రోజులలో 100శాతం రాష్ట్ర నిధులతో పరిహారం అందిస్తారు. ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాల్లో ఉన్న వారికి ఆ డబ్బు మినహాయించి మిగతా మొత్తం అందజేస్తారు.
పర్యటన్ సంవర్ధన్ యోజన
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా జనవరి 21న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి పర్యటన్ సంవర్ధన్ యోజన’ స్కీంను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రూ.50లక్షలతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు.
జైపూర్ సాహిత్య ఉత్సవాలు
జనవరి 27 నుంచి 31 వరకు 13వ జైపూర్ సాహిత్య ఉత్సవాలు రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ‘మహాకవి సేథియ’ అవార్డును ప్రముఖ కవి, విమర్శకుడు ‘అరవింద్ కృష్ణ మెహ్రోత్రా’కు లభించింది. ఈ సాహిత్య ఉత్సవాలను 2016లో ప్రారంభించారు.
ఆపద్ ప్రబంధన్ పురస్కార్
ఏటా సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం అందించే ‘సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్’ను టీమ్ విభాగంలో ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కేంద్రానికి లభించింది. వ్యక్తిగత విభాగంలో కుమార్ మున్నాన్ సింగ్కు ప్రకటించారు. ఈయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రంలో 2004 నుంచి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ అవార్డు కింద టీమ్ విభాగానికి రూ.51లక్షలు, వ్యక్తిగత విభాగంలో రూ.5లక్షల నగదును అందిస్తుంది.
గ్రీన్ నోబెల్ అవార్డు
పర్యావరణ నష్టం, ఆర్థిక పరిణామాలను కార్పొరేట్, ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకురావడంలో చేసిన కృషికి భారత పర్యావరణ వేత్త, యూఎన్ ఎన్విరాంట్ ప్రోగ్రాం గుడ్విల్ అంబాసిడర్ పవన్ సుఖ్ దేవ్కు ప్రతిష్టాత్మక టేలర్ అవార్డు లభించింది. పర్యావరణ రంగంలో నోబెల్గా పిలిచే ఈ పురస్కారాన్ని ప్రముఖ బయాలజిస్టు గ్రెషెన్ డైలీతో కలిసి పంచుకోనున్నారు. హరిత ఆర్థికవ్యవస్థ దిశగా చేసిన కృషికిగాను పవన్కు ఈ అవార్డు లభించింది. 2008లో ఈయన తీసుకొచ్చిన ‘ది ఎకనమిక్స్ అండ్ బయోడైవర్శిటీ’ నివేదిక యూఎన్ఈపీ గ్రీన్ ఎకానమీ ఉద్యమానికి పునాదిగా నిలిచింది.
జాతీయ బాలిక దినోత్సవం
జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించారు. ‘అవేర్ గర్ల్ చైల్డ్ ఏబుల్ మధ్యప్రదేశ్’ అనే థీమ్ తో ఈ ఏడాది ఉత్సవాలను ప్రారంభించారు. 2008 లో మొదటి సారిగా కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ తొలిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించింది. ఏటా జనవరి 24 నుంచి 30 వరకు జాతీయ బాలికా వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఏడీఎం చావాలి
బ్యాంకింగ్ మోసాలపై సలహాలిచ్చేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా ఏడీఎం చావలి నియమితులయ్యారు. దీనికి టీఎం బాసిన్ నేతృత్వం వహిస్తున్నారు. రూ.50 కోట్లకు పైబడిన మోసాలలో బ్యాంకుల జనరల్ మేనేజర్ల పాత్రను ఇది పరిశోధించనుంది. ఆర్థికవ్యవస్థలోని మోసాలతోపాటు, వాటి నివారణకు ఆర్బీఐకు సలహాలివ్వనుంది.
తరుణ్ జీత్సింగ్
అమెరికాలో భారత రాయబారిగా తరణ్జీత్సింగ్ సంధు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం శ్రీలంకలోని ఇండియా హై కమిషనర్గా కొనసాగుతున్నారు. విదేశాంగ కార్యదర్శిగా నియమితులైన హర్షవర్ధన్ ష్రింగ్లా స్థానంలో ఈ నియామకం చేపట్టారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆల్ ఇన్ వన్ యాప్
సిటీ యూనియన్ బ్యాంక్ దేశంలోనే తొలిసారిగా వాయిస్ ఆధారిత మల్టీ లాంగ్వేజ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘ఆల్ ఇన్ వన్’ను ప్రవేశపెట్టింది. ఈ బ్యాంకు కస్టమర్లు యాప్ ఓపెన్ చేసి ‘ఆస్క్ లక్ష్మి’ అని సంభోదిస్తూ తమిళం, తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలో లావాదేవీలు, బ్యాలెన్స్ వివరాలు, మినీ స్టేట్మెంట్, క్యాష్ విత్డ్రా వంటి సేవలను తెలుసుకోవచ్చు.
ఆర్బీఐ ‘మనీ’
కంటిచూపు సరిగ్గా లేని వారు కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మనీ’ యాప్ను తీసుకొచ్చింది. వినియోగదారులు మొబైల్ కెమెరాను ఉపయోగించి కరెన్సీ నోటును స్కాన్ చేస్తే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో నోట్ ఎంత విలువనో చెప్పేస్తుంది. డీమానిటైజేషన్ తర్వాత వచ్చిన కొత్త కరెన్సీని గుర్తించడంలో అంధులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ యాప్కు రూపకల్పన చేసింది.