కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు.. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో 1నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి అర్హత కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 10 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షను సెప్టెంబర్ 6న ఆఫ్లైన్ విధానంలో దేశంలోని 132 నగరాల్లో, 27 భాషల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి అర్హత సాధించవచ్చు.
ముఖ్యమైన తేదీలు,పరీక్షా విధానం:ఈ పరీక్షకు హాజరుకావాలనుకునే.. అభ్యర్థులు జూన్ 10 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా తప్పులు జరిగితే, వాటిని సరిచేసుకోవడానికి జూన్ 15 నుంచి 18 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. ఇక పరీక్షను సెప్టెంబర్ 6 (ఆదివారం) నాడు ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. సెప్టెంబర్ 5న కూడా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
పేపర్ల వివరాలు.. అర్హత మార్కులు:
సీటెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-I, 6 నుంచి 8 తరగతుల కోసం పేపర్-II రాయాలి. రెండు స్థాయిలకూ అర్హత ఉన్నవారు రెండు పేపర్లకూ హాజరుకావచ్చు. ఒక్కో పేపర్లో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 2 గంటల 30 నిమిషాల సమయం ఇస్తారు. ఇందులో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ,దివ్యాంగులకు నిబంధనల ప్రకారం 5% సడలింపు ఉంటుంది. ఒక్కసారి ఈ పరీక్షలో క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్కు రూ.1000, రెండు పేపర్లకు కలిపి రూ. 1200 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఒక పేపర్కు రూ.500, రెండు పేపర్లకు రూ. 600 గా నిర్ణయించారు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫోటో, సంతకం స్కాన్ కాపీలను అప్లోడ్ చేసి, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ద్వారా ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.





