మంచి ఉద్యోగం చేయాలంటే పెద్ద చదువులు, ఫేమస్ యూనివర్సిటీలో చదవాల్సిన పని లేదు. కేవలం ఇంటర్ తర్వాత రెండున్నర ఏండ్లు ఈ కోర్సు చేస్తే చాలు. అవును.. కంపెనీ సెక్రెటరీ (సీఎస్) కోర్సుకు ఇప్పుడు దేశంలో అంత భారీ డిమాండ్ ఉంది. జాబ్ ప్రారంభంలోనే నెలకు రూ.40 వేల పైగా జీతం కూడా అందుకోవచ్చు. మీ ప్రతిభ ఆధారంగా కొద్దికాలంలోనే రూ.లక్షకు పైగా సాలరీ అందుకునే ఛాన్స్ ఇందులో ఉంది. ఇంటర్ చదువుతూనే ఈ కోర్సులో చేరే అవకాశం ఉంది. కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్ చేసిన వారే కాకుండా ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులు, బీటెక్ చేస్తున్న వారు కూడా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. సీఎస్ కోర్సుకు పీజీ కోర్సులతో సమానంగా యూజీసీ గుర్తింపు ఇచ్చింది
హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)లో సీఎస్ కోర్సు అందుబాటులో ఉంది.
కోర్సులో ఎలా చేరాలి
18 ఏండ్లు నిండినవారు సీఎస్ కోర్సులో చేరవచ్చు. ఇంటర్ చదువుతున్నవారు కంపెనీ సెక్రటరీ ఎగ్జిగ్యూటివ్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఎస్ఈఈటీ) ద్వారా అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ ఏడాది మే 7 వ తేదీన జరుగనున్నది. 50% మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు ఎంట్రన్స్ టెస్ట్ తో సంబంధం లేకుండా నేరుగా సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో చేరవచ్చు. పీజీ పూర్తిచేసిన వారైతే నేరుగా సీఎస్ ప్రొఫెషనల్ ప్రొగ్రాంలో చేరవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐదేండ్లల్లో ఈ మూడు ప్రొగ్రాంలను పూర్తిచేయాల్సి ఉంటుంది. కనిష్టంగా రెండున్నర ఏండ్లల్లోనే మూడు ప్రోగ్రాంలు, ట్రైనింగ్ పూర్తిచేసి కంపెనీ సెక్రటరీ ఉద్యోగంలో చేరవచ్చు.
విద్యార్థులు ముందుగా రూ.1,000 ఫీజు చెల్లించి www.icsi.edu వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీఎస్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రొగ్రాంలను రూ.35 వేలలోపు ఫీజుతో పూర్తిచేయవచ్చు. ఈ కోర్సుల్లో చేరినవారికి పుస్తకాలు ఉచితంగా ఇస్తారు.
అడ్మిషన్స్కు సంప్రదించాల్సిన అడ్రస్
ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులకు పూర్తి వివరాలు www.icsi.edu వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో ఐసీఎస్ఐ సీవోఈ బిల్డింగ్, సర్వే నెంబర్ -1 జెన్ప్యాక్ట్ రోడ్, ఐడీఏ ఉప్పల్లో ఉంది. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిలాల్లో స్టడీ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులే
కరోనా వల్ల ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ పద్ధతిలో కోర్సును పూర్తిచేయవచ్చు. క్లాసులకు హాజరయ్యేవారికి నామమాత్రంగా ఫీజులు తీసుకుంటారు. మూడు ప్రోగ్రాంలను పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు 21 నెలలు ట్రైనింగ్ పూర్తి చేయాలి. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్న సీఎస్ ల వద్ద అసిస్టెంట్గా లేదంటే కంపెనీల్లో ప్రొబేషనర్లుగా విధులు నిర్వహించాలి. శిక్షణ టైమ్లో కొంత స్టైఫండ్ పొందే వీలుంది. తర్వాత ఐసీఎస్ఐ నిర్వహించే 30 రోజుల కార్పొరేట్ లీడర్షిప్ ప్రొగ్రాం పూర్తి చేస్తే ఐసీఎస్ఐ సభ్యత్వం లభిస్తుంది. దీంతో కంపెనీ సెక్రటరీ అయిపోయినట్టే. మీ అభిరుచి మేరకు ఉద్యోగాల్లో చేరవచ్చు. లేదంటే సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
సీఎస్ కోర్సుకు యూజీసీ గుర్తింపు
ఇప్పుడున్న బిజినెస్ నిబంధనల ప్రకారం రూ.10 కోట్ల కేపిటల్ ఉన్న ప్రతి సంస్థకు ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని (సీఎస్) ఉండాలి. ఇలాంటి కంపెనీలు మన దేశంలో లక్షకు పైగా ఉన్నాయి. కానీ రిజిస్టర్డ్ సీఎస్లు కేవలం 60 వేల మందే ఉన్నారు. హైదరాబాద్ చాప్టర్ పరిధిలో కేవలం 2,300 మంది సీఎస్లు మాత్రమే ఉన్నారు. ఐసీఎస్ఈలో సభ్యత్వమున్న వారిని మాత్రమే సీఎస్లుగా నియమించుకుంటారు. అందుకే ఈ కోర్సులో చేరితే జాబ్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు.
వివిధ హోదాల్లో ఉద్యోగాలు
కంపెనీ సెక్రటరీలకు రకరకాల హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు సలహాదారు (అడ్వైజర్)గా, కీ మేనేజీరియల్ పర్సనల్గా, కాంప్ల్లియన్స్ ఆఫీసర్గా, సెక్రటేరియల్ ఆడిటర్గా, కార్పొరేట్ రిస్క్ మేనేజర్గా, చీఫ్ గవర్నెన్స్ ఆఫీసర్గా, కార్పొరేట్ ప్లానర్ అండ్ స్ట్రాటజిక్ మేనేజర్గా, ఇంటర్నల్ ఆడిటర్గా, సర్టిఫికేషన్ సర్వీసెస్ ప్రొఫెషనల్గా, జీఎస్టీ ప్రొఫెషనల్గా, రిజిష్టర్డ్ వాల్యూయర్గా, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గా, రిప్రంజేటేషన్ సర్వీస్ ప్రొఫెషనల్గా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు.