కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని.. త్వరలోనే మరో 35 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు ( బుధవారం) హైదరాబాద్లో జరిగిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. విద్యార్థులంతా రోడ్డున పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య గుర్తించామని.. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నిరుద్యోగ తీవ్రతను గుర్తించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 50 లక్షల నిరుద్యోగులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో పదేళ్ల తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఫైర్ అయ్యారు. వెబ్ సైట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారని కానీ రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య మొత్తం తీరదన్నారు. ప్రైవేట్ సెక్టార్ల కూడా యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టిపెట్టామని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమలు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందని.. ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసకున్నామని, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.