మూడేళ్లు సైనికుడిగా పనిచేయాలనుకునే యువకులకు కేంద్రం త్వరలో ‘అగ్నిపథ్ ప్రవేశ పథకం’ ప్రవేశపెట్టనుంది. వీరిని అగ్ని వీరులని పిలుస్తారు. త్రివిధ దళాల్లో వివిధ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. ప్రత్యేక విధులతో పాటు సంక్లిష్ట వాతావరణాల్లోనూ వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మూడేళ్లలో అత్యంత ధైర్యసాహసాలను చూపిన వారిని సైన్యమే రిక్రూట్ చేసుకుంటుంది. మిగిలిన వారికి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందిన భద్రతా సంస్థలు కూడా వీరిని నియమించుకునేలా చర్చలు జరుగుతున్నాయి.
డిఫెన్స్లో 1.25 లక్షల ఖాళీలు
‘అగ్నిపథ్’ పథకంపై గత కొంతకాలంగా త్రివిధ దళాలు కసరత్తు చేస్తున్నాయి. ఇది దాదాపు తుది దశలో ఉందని సమాచారం. కరోనా కారణంగా రెండేళ్లుగా సైన్యంలోకి రిక్రూట్మెంట్ అంతంతమాత్రంగానే జరిగింది. త్రివిధ దళాల్లో దాదాపు 1.25 లక్షలు ఖాళీలు ఉన్నాయని అంచనా. ‘అగ్నిపథ్’ పథకంతో జీతం, పింఛను తదితర ఖర్చులు తగ్గుతాయని.. ఓ అధికారి తెలిపారు. ‘‘అద్భుతంగా రాణించిన వారిని ఉంచుకుంటాం. మిగిలిన మెజారిటీ యువకులు సైన్యం నుంచి నిష్క్రమిస్తారు. ఓ రకంగా ఇది తక్కువ వ్యవధి గల ఓ సైనిక ఉద్యోగం’ అని ఆ అధికారి పేర్కొన్నారు.